పాక్ చేతుల్లో చేజేతులా ఓడిన ఇంగ్లాండ్... మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్న టీమిండియా ఫ్యాన్స్...
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్లో పర్యటిస్తోంది ఇంగ్లాండ్ జట్టు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జరుగుతున్న ఏడు మ్యాచుల టీ20 సిరీస్లో ఇప్పటిదాకా చెరో రెండు మ్యాచులు గెలిచాయి పాకిస్తాన్, ఇంగ్లాండ్. అయితే కరాచీలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిన విధానం, సగటు క్రికెట్ ఫ్యాన్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...
England vs Pakistan
ఇంగ్లాండ్ విజయానికి 10 బంతుల్లో 5 పరుగులు మాత్రమే కావాలి. ఇంగ్లాండ్ కాదు కదా... ఇలాంటి పొజిషన్లో ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే టీమ్స్ ఉన్నా ఈజీగా గెలిచేస్తాయి. అయితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో రెండో పొజిషన్లో ఉన్న ఇంగ్లాండ్ మాత్రం 3 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...
167 పరుగుల లక్ష్యఛేదనలో 18 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఆఖరి 2 ఓవర్లలో 9 పరుగులు చేస్తే చాలు. హరీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్ రెండో బంతికి డాసన్ ఫోర్ బాదాడు. దీంతో 10 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన పొజిషన్కి చేరుకుంది ఇంగ్లాండ్... ఇక్కడే అసలైన హై డ్రామా మొదలైంది...
17 బంతుల్లో 34 పరుగులు చేసిన డాసన్, 19వ ఓవర్ మూడో బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే ఓల్లీ స్టోన్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఆ తర్వాతి బంతికి టోప్లేని ఎల్బీడబ్ల్యూ అవుట్ కోసం డీఆర్ఎస్ రివ్యూ తీసుకుంది పాకిస్తాన్. రివ్యూలో నాటౌట్గా తేలింది..
ఆ తర్వాతి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి4 పరుగులు మాత్రమే కావాల్సి రాగా మొదటి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి సింగిల్ తీయబోయి టోప్లే రనౌట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్కి 3 పరుగుల తేడాతో విజయం దక్కింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో చిత్తుగా ఓడింది ఇంగ్లాండ్...
ఈ మ్యాచ్లో ఇంత హై డ్రామా నడవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీమిండియా అభిమానులు. ఇంగ్లాండ్ ప్లేయర్లతో పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఉంటుందని ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్తో జరిగిన మ్యాచ్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు పాక్ అభిమానులు...
Babar and Rizwan
విరాట్ కోహ్లీ 71వ సెంచరీ అందుకున్న ఆ మ్యాచ్లో ఆఫ్ఘాన్ బౌలర్లు కావాలనే ఎక్కువ పరుగులు ఇచ్చారని, ఫీల్డర్లు క్యాచ్లు డ్రాప్ చేశారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్, పాకిస్తాన్లపై ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు భారత అభిమానులు...
Deepti Sharma
అదీకాకుండా దీనికి భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్లో దీప్తి శర్మ చేసిన మన్కడింగ్ రనౌట్పై రేగిన వివాదం కూడా టీమిండియా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంగ్లాండ్ మెన్స్ టీమ్ అంతా కలిసి దీప్తి శర్మ ‘క్రికెట్ స్పిరిట్’ని ప్రశ్నించారు...
ఐసీసీ రూల్ ప్రకారం రనౌట్ చేసిన దీప్తి శర్మ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించిన ఇంగ్లాండ్ క్రికెటర్లు, పాకిస్తాన్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని 10 బంతుల్లో 5 పరుగులు చేయలేక... ఇలా చిత్తుగా ఓడిపోయారంటూ ట్రోల్స్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు...