రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టిన కివీస్ ఓపెనర్.. ఇకపై అతడే నెంబర్ వన్..
Most Runs in T20I: టీ20లలో టీమిండియా సారథి పేరిట ఉన్న అరుదైన రికార్డును కివీస్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ బద్దలుకొట్టాడు. తద్వారా అగ్రస్థానానికి చేరాడు.

పొట్టి ఫార్మాట్ లో చెలరేగి ఆడటంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ శైలే వేరు. టీ20లలో (పురుషుల) అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకు హిట్ మ్యాన్ పేరిటే ఉండేది. కానీ న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ తాజాగా ఆ రికార్డును బద్దలుకొట్టాడు.
టీ20లలో అత్యధిక పరుగులు (3,379) సాధించిన ఘనతను గప్తిల్ బద్దలుకొట్టాడు. స్కాట్లాండ్ తో కివీస్ ఆడిన తొలి టీ20 మ్యాచ్ లో అతడు 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ లో గప్తిల్ చేసిన పరుగులు 3,399 కు చేరాయి.
రోహిత్ శర్మ 128 మ్యాచులలో నాలుగు సెంచరీలు, 26 అర్థ సెంచరీల సాయంతో 3,379 పరుగులు చేశాడు. గప్తిల్.. 116 మ్యాచుల్లోనే హిట్ మ్యాన్ రికార్డును అందుకున్నాడు. అతడి టీ20 కెరీర్ లో 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలున్నాయి.
ఇక టీ20లలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గప్తిల్, రోహిత్ తర్వాత స్థానం టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీది. కోహ్లీ 3,308 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్కాట్లాండ్ కు చెందిన పాల్ స్టిర్లింగ్ (2,894) ఉండగా ఐదో స్థానంలో ఆరోన్ ఫించ్ (2,855) ఉన్నాడు.
స్కాట్లాండ్ - న్యూజిలాండ్ మధ్య ముగిసిన తొలి టీ20లో కివీస్ జట్టు 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ (56 బంతుల్లో 101, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ బాదాడు. లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్.. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.