ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదో టెస్టుపై ఎటూ తేల్చని ఐసీసీ... వచ్చే ఏడాదిలో సిరీస్ ముగించాలని...
ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభానికి ముందు భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు, కరోనా వల్ల అర్ధాంతరంగా రద్దైన విషయం తెలిసిందే. అయితే సిరీస్ ఫలితంపై నిర్ణయం తీసుకునే బాధ్యతను ఐసీసీకి అప్పగించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...
భారత బృందంలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడం, ఆటగాళ్లకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చినా ఐదో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా మ్యాచ్ ఆడేందుకు అంగీకరించకపోవడంతో మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది...
మాంచెస్టర్ టెస్టు ఆరంభానికి కొన్ని గంటల ముందు మ్యాచ్ ఆడడానికి భారత ఆటగాళ్లు భయపడడంతో టెస్టును అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చిందని, కాబట్టి మ్యాచ్ను ‘ఫోర్ఫీట్’గా పరిగణించాలని ఐసీసీని కోరింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...
అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటూ తేల్చలేకపోతోంది... కరోనా కారణంగా చాలా సిరీస్లు రద్దు చేయాల్సి వచ్చింది, కొన్ని టూర్లను వాయిదా వేయాల్సి వచ్చింది...
డిసెంబర్లో ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడాల్సిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కూడా ఆతిథ్య దేశంలో కరోనా నియామాలను చూసి భయపడుతోంది... రూల్స్ సరళీకృతం చేయకపోతే ఆసీస్ టూర్ను రద్దు చేసుకుంటామని కొందరు ప్లేయర్లు హెచ్చరించారు కూడా...
విపత్తు సమయంలో ఇలా క్రికెట్కి కరోనా అంతరాయం కలిగించడం చాలా కామన్గా మారిపోయింది. దీంతో ఐదో టెస్టు ఫలితాన్ని ఇంగ్లాండ్ ఖాతాలో వేసేందుకు ఐసీసీ సుముఖంగా లేదని సమాచారం...
నాలుగు టెస్టుల్లో రెండింట్లో గెలిచిన టీమిండియాకి 2-1 తేడాతో సిరీస్ను అప్పగించడానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సముఖంగా లేదు. దీంతో వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు సిరీస్ను ముగించాలని భావిస్తున్నారట...
ఇప్పటికే బీసీసీఐతో పాటు ఈసీబీ కూడా ఈ ఏడాది టెస్టు సిరీస్ ఇక్కడితో ముగిసిందని, వచ్చే ఏడాది జరిగే మ్యాచ్ ఏకైక టెస్టుగా పరిగణిస్తామని ప్రకటించాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని కూడా టెస్టు సిరీస్లో భాగంగా పరిగణించాలని భావిస్తున్నారు...
ఇప్పటికే ఐదో టెస్టు రద్దు కావడంతో ఇంగ్లాండ్ బోర్డుకు కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు వచ్చే ఏడాది మరో రెండు టీ20 మ్యాచులు అధికంగా ఆడేందుకు అంగీకరించింది బీసీసీఐ...
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లాండ్లో పర్యటించే భారత జట్టు... మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది. అయితే ఇప్పుడు మరో టెస్టు లేదా రెండు టీ20 మ్యాచులు అదనంగా ఆడనున్నారు...