మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్?!... క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో...
టీమిండియా కెప్టెన్గా ఎంతటి పాపులారిటీ తెచ్చుకున్నాడో, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా అంతకు మించిన క్రేజ్ తెచ్చుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ... కెప్టెన్గా చెన్నైకి మూడు సార్లు టైటిల్ అందించిన ధోనీని ‘తలైవా’ అంటూ పిలుచుకుంటారు అక్కడి అభిమానులు...
2008 నుంచి 2019 దాకా ఆడిన 10 సీజన్లలో 10సార్లు ఫ్లేఆఫ్, 8 సార్లు ఫైనల్ చేరిన ఒకే ఒక్క జట్టుగా తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
అయితే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో ఘోరమైన ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది... ఐపీఎల్ కెరీర్లోనే సీఎస్కేకి ఇదే చెత్త ప్రదర్శన...
వాస్తవానికి ఐపీఎల్ 2019లో చెన్నై సూపర్ కింగ్స్ను రన్నరప్గా నిలిపిన సారథి మహేంద్ర సింగ్ ధోనీ, 2020 సీజన్ తర్వాత సీఎస్కే జట్టు నుంచి బయటికి రావాలని ఆశపడ్డాడు...
2021 వేలంలో ఉండి, తనకి ఎంత రేటు పలుకుతుందో తెలుసుకోవాలని భావించాడు. కెప్టెన్గా, ప్లేయర్గా ధోనీకి ఉన్న క్రేజ్కి వేలంలో రూ.20 కోట్లు వచ్చినా తక్కువేనని విశ్లేషకుల అంచనా...
అయితే 2020 సీజన్ ఆ లెక్కలన్నింటినీ తారుమారు చేసింది. కెప్టెన్గానే కాకుండా ప్లేయర్గా కూడా ఫెయిల్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ, ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో తన రేంజ్ పర్ఫామెన్స్తో మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయాడు...
2020 సీజన్ నడుస్తున్నన్ని రోజులు మాహీతో ఫోటోలు దిగేందుకు, అతని ఆటోగ్రాఫ్ ఉన్న జెర్సీలను తీసుకునేందుకు క్యూ కట్టారు యంగ్ప్లేయర్లు.
దీంతో 2020 సీజన్ ఆరంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడని ప్రచారం జరిగింది...
అయితే 2020 సీజన్లో సీఎస్కే ఆడిన ఆఖరి మ్యాచ్లో ‘డెఫనెట్లీ నాట్’ అంటూ ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...
2020 సీజన్లో సీఎస్కే సరైన పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో ఫ్రాంఛైజీ మారే ఆలోచనను పక్కనబెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభానికి ముందు కూడా మరోసారి ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నాయి..
అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్... ‘నాకు తెలిసి మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఇంకా ఆలోచించడం లేదు. మేం కూడా మాహీ స్థానంలో మరో కెప్టెన్ గురించి ఆలోచించడం లేదు’ అంటూ కామెంట్ చేశాడు...
ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత క్రికెట్కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, మళ్లీ ఐపీఎల్లోనే ఆడబోతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత సురేశ్ రైనా, అంబటి రాయుడు వంటి ప్లేయర్లు దేశవాళీ క్రికెట్లో విజయ్ హాజారే, సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీల్లో ఆడినా ధోనీ మాత్రం డబ్బులు రాని ఈ టోర్నీల్లో ఆడడానికి ఇష్టపడలేదు.