KS Bharat: సెంచరీతో అదరగొట్టిన ఆంధ్రా కుర్రాడు.. ఐపీఎల్ వేలానికి ముందు ఆకట్టుకునే ప్రదర్శన
IPL 2022 Auction: ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి గత ఐపీఎల్ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్అయిన రుతురాజ్ గైక్వాడ్, మధ్యప్రదేశ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ లు విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నారు. తాజాగా....!
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ వేలం జరుగునున్నది. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీల చూపంతా ఇప్పుడు దేశవాళీ లీగ్ లు, ట్రోఫీల మీద ఉంది. విదేశీ ఆటగాళ్ల సంగతి పక్కనబెడితే.. టీమిండియాలోకి రావాలని కలలు కంటున్న పలువురు యువ ఆటగాళ్లు భారత్ లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నారు.
ఇప్పటికే ipl 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి ఆరెంజ్ క్యాప్ హోల్డర్అయిన రుతురాజ్ గైక్వాడ్ భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తూ.. విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. అతడికి తోడుగా మధ్యప్రదేశ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ కూడా రాణిస్తున్నాడు.
ఇక తాజాగా ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్ కూడా ఈ ట్రోఫీలో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా.. ఆదివారం హిమాచల్ ప్రదేశ్ తో ఆంధ్రప్రదేశ్ జట్టు తలపడుతున్నది.
ఈ మ్యాచ్ లో కెఎస్ భరత్ సెంచరీ చేశాడు. వన్ డౌనల్ లో బ్యాటింగ్ కు వచ్చిన భరత్.. 109 బంతుల్లో 161 పరుగులు సాధించాడు. ఇందులో 16 బౌండరీలు, 8 సిక్సర్లుండటం గమనార్హం.
భరత్ తాజా ప్రదర్శనపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. ఐపీఎల్ 2021 లో సాధారణ ధర రూ.20 లక్షలకు అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. గత సీజన్ లో అతడు.. ఆ జట్టు తరఫున 8 మ్యాచులాడి 191 పరుగులు సాధించాడు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మద్య జరిగిన పోరులో ఆఖరు బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉన్న దశలో.. క్రీజులో ఉన్న భరత్ సిక్సర్ కొట్టి ఆర్సీబీకి విజయాన్నందించాడు. ఆ మ్యాచ్ తో భరత్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.
కానీ ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటైన్ ప్లేయర్ల జాబితాలో ఆర్సీబీ అతడిని నిలుపుకోలేదు. త్వరలో ఐపీఎల్ వేలంలో అతడిని తిరిగి దక్కించుకోవాలని ఆర్సీబీ చూస్తున్నది. ఆర్సీబీతో పాటు మరికొన్ని జట్లు కూడా భరత్ వైపు చూస్తున్నాయి. వికెట్ల వెనుక చురుకుగా ఉండటమే గాక బ్యాట్ తోనూ విలువైన పరుగులు చేయడంలో భరత్ దిట్ట.
ఇటీవలే స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ తో సిరీస్ లో కూడా భరత్.. స్టాండ్ బై వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. తొలి టెస్టులో మెడ నొప్పితో గాయపడిన రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో అతడు వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా మోశాడు.
ఇదిలాఉండగా.. విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 322 పరుగుల భారీ స్కోరు చేసింది. భరత్ తో పాటు అశ్విన్ హెబ్బర్ కూడా సెంచరీ బాదాడు.