Rohit Sharma: కెప్టెన్ ఓకే.. వైస్ కెప్టెన్ పదవికి ఇద్దరు పోటీ.. ఢిల్లీ సారథికి ఏజ్ ప్రాబ్లమ్..
KL Rahul: టీమిండియా వన్డే క్రికెట్ కు కొత్త సారథి వచ్చాడు. విరాట్ కోహ్లీపై వేటు వేసిన బీసీసీఐ అధికారులు.. ఆ బాధ్యతలను హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అప్పగించారు. ఇక తర్వాత ప్రశ్న వన్డే వైస్ కెప్టెన్ ఎవరు..?
భారత వన్డే క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ శకం ముగిసింది. పరిమిత ఓవర్లకు కొత్త సారథి వచ్చాడు. ఇప్పటికే టీ20లలో సారథ్య బాధ్యతలు దక్కించుకున్న రోహిత్ శర్మ.. తాజాగా వన్డేలకు కూడా కెప్టెన్ అయ్యాడు.
ఈ మేరకు బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన కూడా చేసింది. త్వరలో జరుగబోయే దక్షిణాఫ్రికా పర్యటనతోనే రోహిత్.. తన పని మొదలుపెట్టనున్నాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ ఎవరు..? అనే ప్రశ్న తలెత్తుతున్నది. దీనికి ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా నడుస్తున్నది. వీరిలో కెఎల్ రాహుల్ ఒకడు కాగా.. మరొకరు వికెట్ కీపర్ రిషభ్ పంత్. ఉప సారథి కోసం వీరిమధ్య పోటీ తీవ్రంగా నెలకొంది.
అయితే బీసీసీఐ పెద్దలు మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఐపీఎల్ తో పాటు భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో తిరుగులేని బ్యాటర్ గా దూసుకుపోతున్న రాహుల్.. భవిష్యత్ కెప్టెన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఈ క్రమంలో రాహుల్ నే రోహిత్ కు డిప్యూటీ గా నియమించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అదీగాక ఇటీవలే న్యూజిలాండ్ తో ముగిసిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ కు కూడా రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
ఈ మేరకు బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘కెఎల్ రాహులే తర్వాత వైస్ కెప్టెన్. పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ కు డిప్యూటీగా మరో చాయిస్ లేదు. అంతేగాక చాలా కాలంగా రాహుల్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అదరగొడుతున్నాడు.
రాబోయే కాలంలో అతడు కెప్టెన్ గా కూడా ఎదిగే అవకాశాలున్నాయి. రోహిత్, విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రావిడ్ మార్గ నిర్దేశనంలో రాహుల్ మరో స్థాయికి ఎదుగుతాడు..’ అని తెలిపాడు.
గత కొద్దికాలంగా కెఎల్ రాహుల్ గణాంకాలు కూడా అతడు బెస్ట్ ఛాయిస్ అని ప్రూవ్ చేస్తున్నాయి. ఆగస్టులో ముగిసిన ఇంగ్లాండ్ పర్యటన తర్వాత రాహుల్.. తాను అన్ని ఫార్మాట్లలో సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. ప్రస్తుతానికి టీమిండియాలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో రాహుల్ కంటే మంచి రికార్డు ఉన్న ఆటగాడు మరొకరు లేరు. గడిచిన 24 నెలల్లో వన్డేలలో అతడి సగటు 61.92 గా ఉంది. భారత జట్టులో ఏ ఆటగాడికి ఇంత యావరేజీ లేదు.
టీ20లలో ఇప్పటికే అతడిని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అదీగాక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో రాహుల్ కు మంచి సత్సంబంధాలున్నాయి.
రిషభ్ పంత్ ఇంకా చాలా చిన్నవాడని, కొద్దికాలం క్రితమే కెరీర్ మొదలుపెట్టిన అతడికి ఇప్పుడే అదనపు బాధ్యతలు ఇస్తే అధిక భారం పడుతుందని సదరు ప్రతినిధి చెప్పాడు.
‘రిషభ్ పంత్ చాలా చిన్నవాడు. ఇప్పుడే తనకు అదనపు బాధ్యతలు ఇస్తే అది పంత్ పై అధిక భారం మోపినట్టు అవుతుంది. పంత్ ఇంకా సీనియర్ల నుంచి నేర్చుకోవాల్సి ఉంది...’ అని తెలిపాడు.