‘రండి బాబు రండి... మా దేశానికి వచ్చి ఆడండి’... ఐపీఎల్ 2021 నిర్వహణకు ఆఫర్ల వెల్లువ...
ఐపీఎల్ 2021 సీజన్కి సడెన్ బ్రేక్ పడడంతో మిగిలిన మ్యాచుల నిర్వహణకు అయోమయం నెలకొంది. జూన్ నుంచి బిజీ షెడ్యూల్ ఆడనున్న టీమిండియా, ఎప్పుడు, ఎక్కడ ఐపీఎల్ మ్యాచులు ఆడాలనే విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే ‘మా దేశానికి వచ్చి ఆడండి’ అంటూ వివిధ దేశాల నుంచి బీసీసీఐకి ఆఫర్లు వస్తున్నాయట.
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామంటూ ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్లు ఆఫర్ ఇచ్చాయి. దీంతో పాటు ఐర్లాండ్, యూఏఈ నుంచి నుంచి మ్యాచ్లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆఫర్లు అందాయి.
తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఐపీఎల్ మిగిలిన మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు తమ దేశం రెఢీ అంటూ ప్రకటించింది. ప్రస్తుతం లంకలో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, కావాలంటే ప్రేక్షకులను కూడా అనుమతిస్తామని చెబుతోంది లంక క్రికెట్ బోర్డు...
మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులు నిర్వహించేందుకు ఇంగ్లాండ్ అయితేనే కరెక్టుగా ఉంటుందని అంటున్నాడు ఆ దేశ మాజీ కెప్టెన్, క్రికెటర్ కేవిన్ పీటర్సన్...
‘ఐపీఎల్ 2021 సీజన్ను ముగించేందుకు యూఏఈ సరైన వేదిక అవుతుందని చాలామంది అంటున్నారు. అయితే సెప్టెంబర్లో మ్యాచులు నిర్వహించాలనుకుంటే, యూకేలో పెడితేనే మంచిది...
సెప్టెంబర్ నాటికి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను ముగిస్తుంది టీమిండియా. అప్పటికి భారత క్రికెటర్లు ఇక్కడే ఉంటారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా సిద్ధంగా ఉంటారు... సెప్టెంబర్లో యూకే వాతావారణం అత్యద్భుతంగా ఉంటుంది...
మాంచెస్టర్, లీడ్స్, బిర్మింగమ్, లండన్ గ్రౌండ్స్లో మ్యాచులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఇక్కడ కొన్ని ఫ్రెండ్లీ, ఎగ్జిబిషన్ మ్యాచులు పెడదాం...
అవి సక్సెస్ అయితే ఐపీఎల్ పూర్తి సీజన్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరమైతే నేను దీని గురించి లండన్ మేయర్ సదీక్ ఖాన్తో మాట్లాడుతాను’ అంటూ తెలిపాడు కేవిన్ పీటర్సన్...
లండన్ మేయర్ సదీక్ ఖాన్, నగరంలో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపాడు. ‘కరోనా విపత్తు తర్వాత లండన్ నగరం బోసిపోయినట్టుగా మారింది. నగర జనాల్లో మళ్లీ ఉత్సాహం నింపడానికి ఐపీఎల్ చక్కగా ఉపయోగపడుతుంది.
లండన్ జనాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి క్రికెట్ హీరోలను చూడడానికి ఎంతగానో ఇష్టపడతారు. లార్డ్స్తో పాటు కియా ఓవల్ స్టేడియంలో కూడా ఐపీఎల్ మ్యాచులు నిర్వహించండి’ అంటూ చెప్పుకొచ్చాడు సదీక్ ఖాన్...