ఒంటరిగా డ్రైవింగ్ ప్రమాదం.. మీకు ఆ స్థోమత ఉన్నా విస్మరించొద్దు : పంత్కు కపిల్ దేవ్ కీలక సూచన
Rishabh Pant Accident: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతడికి పరామర్శలు వెల్లువెత్తుతుండగా తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ సారథి కపిల్ దేవ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు.
గత శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురై డెహ్రాడూన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. పంత్ ఆరోగ్యం త్వరితగతిన మెరుగుపడాలని అతడి అభిమానులతో పాటు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. కీలక సూచనలు చేశాడు. ఒంటరిగా డ్రైవింగ్ చేయొద్దని సూచించాడు.
కపిల్ దేవ్ స్పందిస్తూ.. ‘మీ దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి. చాలా హైస్పీడ్ తో దూసుకెళ్తాయి. కానీ మీరు (పంత్ ప్రమాదం నేపథ్యంలో అతడిని ఉద్దేశిస్తూ) జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్ ను పెట్టుకునే స్థోమత ఉంది. కావున ఎప్పుడూ ఒంటరిగా డ్రైవింగ్ చేయకూడదు.
డ్రైవింగ్ మీద ఆసక్తో లేక వాళ్లకున్న అభిరుచితోనో చాలా మంది సొంతగా డ్రైవింగ్ చేస్తుంటారు. వయసురీత్యా అది సహజమే. కానీ మనం బాధ్యతలను కూడా గుర్తెరగాలి. వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి...’ అని చెప్పాడు.
తాను కూడా యుక్త వయసులో ఉండగా ఇలాగే ఓసారి ప్రమాదానికి గురయ్యానని, కానీ ఆ తర్వాత బండిని ముట్టుకోలేదని తెలిపాడు. ‘నేను యుక్త వయసులో ఉన్నప్పుడు నాకూ బైక్ యాక్సిడెంట్ అయింది. అప్పట్నుంచి మా సోదరుడు నన్ను బండిని ముట్టుకోనీయలేదు..’అని అన్నాడు.
ఇదిలాఉండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్ ను ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డ్ కు తరలించారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పంత్ కు ఇన్ఫెక్షన్స్ రాకుండా అతడికి ప్రైవేట్ వార్డుకు మార్చినట్టు మ్యాక్స్ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
ఇదే విషయమై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ స్పందిస్తూ.. ‘పంత్ ఆరోగ్యం మెరుగవుతోంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అతడిని ఆదివారం సాయంత్రం ప్రైవేట్ వార్డ్ కు మార్చారు.. పూర్తిగా కోలుకునేదాకా అతడు అక్కడే ఉంటాడు..’అని చెప్పాడు.