ఆసియా కప్కి ముందు టీమిండియాకి భారీ షాక్... గాయంతో జస్ప్రిత్ బుమ్రా దూరం!...
ఆసియా కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్గా బరిలో దిగుతోంది భారత జట్టు. అయితే ఆసియా కప్ టోర్నీకి రెండు వారాల ముందు గాయంతో జస్ప్రిత్ బుమ్రా దూరమయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టెస్టులో భారత జట్టుకి కెప్టెన్గా వ్యవహరించిన జస్ప్రిత్ బుమ్రా, ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్లో పాల్గొన్నాడు...

ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, వెస్టిండీస్ టూర్కి దూరంగా ఉన్నాడు. తాజాగా జస్ప్రిత్ బుమ్రాకి వెన్ను గాయం అయినట్టు, అతనికి మూడు వారాల నుంచి ఐదు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం. ఇదే నిజమైతే ఆసియా కప్లో స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా లేకుండానే బరిలో దిగాల్సి ఉంటుంది భారత జట్టు...
ఇప్పటికే హర్షల్ పటేల్ గాయం కారణంగా ఆసియా కప్ 2022కి దూరమైనట్టు వార్తలు వస్తున్నాయి. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న హర్షల్ పటేల్... వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో చోటు దక్కించుకున్నా రిజర్వు బెంచ్కే పరిమితమయ్యాడు...
Image credit: Getty
జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్... ఇద్దరూ దూరమైతే ఆసియా కప్ 2022 టోర్నీలో భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం వీక్ అయిపోతుంది. భువనేశ్వర్ కుమార్ మంచి ఫామ్లో ఉన్నా... అతనికి సరైన పార్టనర్ ఇప్పుడు అందుబాటులో లేడు...
వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్ అదరగొడుతున్నా... ఈ ఇద్దరికీ 10 మ్యాచులు ఆడిన అనుభవం కూడా లేదు. శార్దూల్ ఠాకూర్ పెద్దగా ఫామ్లో లేడు...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టుకి రెండో ప్రధాన పేసర్గా ఉన్న మహమ్మద్ షమీ... ఆ టోర్నీ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో బుమ్రా, హర్షల్ పటేల్ దూరమైతే భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది...