- Home
- Sports
- Cricket
- స్వదేశంలో భారత్ను ఓడించడం అసాధ్యం.. మావాళ్లు టీమిండియాను చూసి బుద్ది తెచ్చుకోవాలి : రమీజ్ రాజా
స్వదేశంలో భారత్ను ఓడించడం అసాధ్యం.. మావాళ్లు టీమిండియాను చూసి బుద్ది తెచ్చుకోవాలి : రమీజ్ రాజా
INDvsAUS Tests: భారత్ లో భారత్ ను ఓడించడమనేది విదేశీ టీమ్ లకు ఓ కలగా మారుతోంది. పరిమిత ఓవర్ల సిరీస్ లలో అయినా ఒకటో రెండో మ్యాచ్ లు ఓడుతున్న భారత్ టెస్టులలో మాత్రం ఆ అవకాశమే ఇవ్వడం లేదు.

ఏ జట్టు అయినా స్వదేశంలో పులులే. ఈ విషయంలో టీమిండియా రెండాకులు ఎక్కువే చదివింది. ఉపఖండపు పిచ్ ల మీద ఆధిపత్యం చెలాయించాలని, భారత్ ను భారత్ లో ఓడించాలని దిగ్గజ టీమ్ లు, లెజెండరీ ఆటగాళ్లు కలలు కన్నారు. కానీ అందులో చాలా కొద్దిమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ప్రపంచాన్ని గెలిచిన ఆస్ట్రేలియాకు మాత్రం 19 ఏండ్ల నుంచి ఇదొక తీరని కలగా మారుతోంది.
1996లో మొదలైన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో 2004లో మాత్రమే భారత్ లో భారత్ ను ఓడించింది. ఆ తర్వాత పలుమార్లు భారత పర్యటనకు వచ్చినా ఇక్కడ ఆసీస్ పప్పులేమీ ఉడకలేదు. ప్రతీసారి గొప్పలు చెప్పుకుని రావడం ఉత్తచేతులతో పోవడం.. ఇదే ఆనవాయితీగా వస్తున్నది.
తాజాగా జరుగుతున్న బీజీటీ 2023 సిరీస్ లో కూడా ఆస్ట్రేలియా దారుణ ఓటములు మూటగట్టుకుంటున్నది. నాగ్పూర్ తో పాటు ఢిల్లీ టెస్టులలో కనీస ప్రతిఘటన కూడా లేకుండానే మ్యాచ్ లను ఓడుతున్నది. దీంతో స్వదేశంలో భారత్ ఎంత స్ట్రాంగ్ టీమ్ అనేది ఆ జట్టుకు మరోసారి తెలిసివచ్చింది. ఇదే విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చీఫ్ రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఢిల్లీ టెస్టు ముగిశాక రమీజ్ రాజా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘భారత్ లో భారత్ ను ఓడించడమనేది దాదాపు అసాధ్యం. నాగ్పూర్, ఢిల్లీ టెస్టులలో ఆసీస్ స్పిన్ ఆడటంలో దారుణంగా విఫలమైంది. జడేజా అత్యద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు.
ఈ స్పిన్ ట్రాక్ ల మీద వాళ్ల (టీమిండియా) స్ట్రాటజీ సూపర్ గా వర్కవుట్ అవుతోంది. పాకిస్తాన్ కూడా భారత్ మాదిరిగానే స్వదేశంలో ట్రై చేసింది. ప్రత్యర్థిని బోల్తా కొట్టించడానికి స్పిన్ ట్రాక్ లను రూపొందించి ఆడించినా మావాళ్లు విజయాలు అందుకోలేదు. స్వదేశంలో పరిస్థితులను పాకిస్తాన్ జట్టు సరిగా ఉపయోగించుకోలేదు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ను భారత స్పిన్నర్లు కకావికలం చేశారు...’అని అన్నాడు.
పాకిస్తాన్ కూడా భారత ఆటతీరు నుంచి స్ఫూర్తి పొందాలని, స్వదేశంలో మ్యాచ్ లు ఎలా గెలవాలో ఇండియాను చూసి నేర్చుకోవాలని రమీజ్ రాజా పాక్ టీమ్ కు సూచించాడు. గతేడాది ఇదే ఆస్ట్రేలియా టీమ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. రావల్పిండి, కరాచీలలో జీవం లేని పిచ్ లను తయారుచేసి పరువు తీసుకుంది. ముల్తాన్ లో మాత్రం పాకిస్తాన్ ఓడి సిరీస్ ను కోల్పోయింది.