వాళ్లు రానంటున్నారు.. తరలిస్తే తప్పేమి..? పాక్ నుంచి ఆసియా కప్ తరలించాలన్న వాదనకు ఆ దేశ మాజీ క్రికెటర్ మద్దతు
Asia Cup Row: ఆసియా కప్ ఆడేందుకు గాను భారత్ పాకిస్తాన్ కు రానంటే అప్పుడు ఈ టోర్నీని మరోచోటుకి తరలిస్తే తప్పేంటని ప్రశ్నించాడు. దాని వల్ల వచ్చే నష్టం కంటే క్రికెట్ కే మంచి జరుగుతుందని చెప్పాడు.
ఆసియా కప్ నిర్వహణ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు ఒకటి చెబుతుంటే అదే దేశానికి చెందిన మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ మరోవిధంగా స్పందించాడు. ఆసియా కప్ ను తరలించడం వల్ల క్రికెట్ కు మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
ఇదే విషయమై ఇరు దేశాల క్రికెట్ బోర్డులతో పాటు మాజీ క్రికెటర్లు మాటా మాటా అనుకుంటున్న తరుణంలో రజాక్ స్పందించాడు. భారత్ పాకిస్తాన్ కు రానంటే ఆసియా కప్ ను మరోచోటుకి తరలిస్తే తప్పేంటని ప్రశ్నించాడు. దాని వల్ల వచ్చే నష్టం కంటే క్రికెట్ కే మంచి జరుగుతుందని చెప్పాడు.
రజాక్ మాట్లాడుతూ.. ‘అది క్రికెట్ కు మంచిది (ఆసియా కప్ ను దుబాయ్ కు మార్చడం) క్రికెట్ ప్రమోషన్ కూడా అవుతంది. ఇండియా - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లను కేవలం ఐసీసీ టోర్నీలలోనే చూస్తున్నాం. ఒకవేళ ఆసియా కప్ ను దుబాయ్ కు షిఫ్ట్ చేస్తే అది మంచి ఆప్షనే. అది క్రికెట్ తో పాటు క్రికెటర్లకూ మంచిదే కదా..
వాస్తవానికి ఇలా జరుగకూడదు. కానీ ఏం చేస్తాం. గత కొన్నేండ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో ఇలా జరుగుతున్నది. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలి. అలా అయితే అది రెండు దేశాల క్రికెట్ కు చాలా మంచిది..’అని చెప్పాడు.
కాగా ఆసియా కప్ కోసం భారత్.. పాక్ కు రాకపోవడం గురించి పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘పాకిస్తాన్లో క్రికెట్ ఆడడానికి రాకపోతే ఇండియన్ క్రికెట్ టీమ్ నరకానికి వెళ్తుంది. పాక్ టీమ్ బతకడానికి టీమిండియా అవసరం లేదు. అయినా పాక్కి వస్తే ఎక్కడ ఓడిపోతామోనని వాళ్లు భయపడుతున్నారు. అందుకే ఫ్యాన్స్కి ముఖం చూపించలేమని భయపడి ఇక్కడికి రావడం లేదు..’ అంటూ వ్యాఖ్యానించాడు జావెద్ మియాందాద్.
ఈ వ్యాఖ్యలకు టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చాడు. జావెద్ మియాందాద్కి తన స్టైల్లోనే రిప్లై ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్... ‘కానీ మావాళ్లు నరకానికి వెళ్లడానికి ఒప్పుకోవడం లేదు...’ అంటూ నవ్వుతున్నట్టు ఎమోజీ జోడించాడు వెంకటేశ్ ప్రసాద్. పాకిస్తాన్కి వెళితే నరకానికి వెళ్లినట్టేనని పరోక్షంగా కౌంటర్ కామెంట్ చేశాడు ప్రసాద్.