ఇక్కడ గ్రౌండ్లు పెద్దగా ఉంటాయంటున్నారు.. ఎలా ఆడాలో ప్రణాళికలు రచిస్తున్నా.. మిస్టర్ 360 ఆసక్తికర వ్యాఖ్యలు
Suryakumar Yadav: షెడ్యూల్ కంటే ముందుగానే ఆసీస్ కు చేరుకున్న భారత జట్టు.. శనివారం పెర్త్ లోని వాకా క్రికెట్ గ్రౌండ్ లో తొలి ప్రాక్టీస్ సెషన్ ను విజయవంతంగా ముగించింది. ప్రాక్టీస్ లో భాగంగా సూర్య.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, తన కెరీర్ లో అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భారత జట్టు తో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు రెండు వారాల ముందుగానే అక్కడకు చేరి ఆసీస్ పరిస్థితులకు అలవాటు పడుతున్న విషయం తెలిసిందే.
షెడ్యూల్ కంటే ముందుగానే ఆసీస్ కు చేరుకున్న భారత జట్టు.. శనివారం పెర్త్ లోని వాకా క్రికెట్ గ్రౌండ్ లో తొలి ప్రాక్టీస్ సెషన్ ను విజయవంతంగా ముగించింది. టీమిండియా స్టార్ బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.
ప్రాక్టీస్ ముగించుకున్న తర్వాత సూర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ షేర్ చేసిన వీడియో లో సూర్య మాట్లాడుతూ.. ‘తొలి ప్రాక్టీస్ సెషన్ కు హాజరయ్యాను. గ్రౌండ్ లో పరిగెత్తాను. కాసేపు నడిచాను. పిచ్ పై పేస్, బౌన్స్ ఎలా ఉందనేది పరిశీలించాను.
భారత్ తో పోలిస్తే ఇక్కడ పెద్దగా మార్పులేమీ లేకున్నా గాలి మాత్రం చల్లగా వీస్తున్నది. ఇక్కడి వాతావరణానికి అలవాటుపడటానికి కాస్త సమయం పడుతుంది. ఈరోజు ఫస్ట్ నెట్ సెషన్ విజయవంతంగా ముగిసింది.
ఇక్కడి మైదానాలు పెద్దగా ఉంటాయని చెబుతున్నారు. ఆ మేరకు నా ఆటలో కూడా నేను మార్పులు చేసుకుంటున్నా. రాబోయే ప్రపంచకప్ లో రాణించేందుకు గాను నా ప్రణాళికల్లో మార్పులు చేసుకుంటున్నా.. వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..’ అని సూర్య తెలిపాడు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన (ఈనెల 4న) మరుసటి రోజే భారత జట్టు ఆస్ట్రేలియాకు పయనమైన విషయం తెలిసిందే. ఈనెల 16న భారత జట్టు తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆలోపు అక్కడి పరిస్థితులకు అలవాటుపడేందుకు గాను భారత జట్టు వారం రోజుల ముందుగానే ఆసీస్ కు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్.. తమ తొలి మ్యాచ్ ను ఈనెల 23న పాకిస్తాన్ తో ఆడాల్సి ఉంది.