ఇషాంత్ శర్మ ఇప్పట్లో కోలుకోలేడు... వన్డేలకు బ్యాకప్గా నటరాజన్... రోహిత్ తండ్రికి...
ఆసీస్ టూర్ ప్రారంభం అవుతున్నా... ఇప్పటికీ రోహిత్ శర్మ రీఎంట్రీపై క్లారిటీ రావడం లేదు. గాయం కారణంగా మొదటి రెండు టెస్టులకు దూరమైన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను పూర్తిగా టెస్టు సిరీస్ నుంచి తప్పించింది బీసీసీఐ. అలాగే నవ్దీప్ సైనీ కూడా నడుము నొప్పితో బాధపడుతుండడంతో నటరాజన్ను వన్డే జట్టుకు బ్యాక్అప్ బౌలర్గా ఎంపిక చేసింది బీసీసీఐ.
భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ రీఎంట్రీపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు బీసీసీఐ...
గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో టెస్టు సిరీస్కి కూడా రోహిత్ దూరమయ్యాడని టాక్ వినిపించింది... ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఈ విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ కేవలం మొదటి రెండు టెస్టులకు మాత్రమే దూరమయ్యారని, చివరి రెండు టెస్టుల్లో వీరు ఆడతారని చెప్పింది బీసీసీఐ.
అయితే తాజాగా మరోసారి ఈ ఇద్దరి గాయాలపై అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ... ఇషాంత్ శర్మ గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందనే ఉద్దేశంలో పూర్తి టెస్టు సిరీస్ నుంచి తప్పిస్తున్నట్టు తెలిపింది.
రోహిత్ శర్మ గాయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రోహిత్ తండ్రి గురునాథ్ శర్మకి కరోనా సోకడంతో అనారోగ్యానికి గురయ్యాడు. తండ్రి కోసం ఆస్ట్రేలియా వెళ్లకుండా యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాడు రోహిత్.
జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న రోహిత్ శర్మ డిసెంబర్ 8న ఆస్ట్రేలియాకి పయనమవుతాడని సమాచారం ఇచ్చింది బీసీసీఐ. అయితే తాజా సమాచారం ప్రకారం రోహిత్ గాయానికి డిసెంబర్ 11న మరోసారి పరీక్ష చేయనున్నాయి.
ఈ పరీక్షలో రోహిత్ శర్మ గాయం పూర్తిగా కోలుకుందని ఫిజియో సంతృప్తి వ్యక్తం చేస్తే, రోహిత్ శర్మ చివరి రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా వెళతాడు...
లేదంటే ఇషాంత్ శర్మతో పాటు రోహిత్ శర్మ కూడా టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నట్టే. అంతర్జాతీయ మ్యాచ్ల కంటే ఐపీఎల్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న బీసీసీఐ, ఆటగాళ్ల కెరీర్తో ఆటలాడుకుంటోందని అంటున్నారు క్రికెట్ అభిమానులు.
ఐపీఎల్ 2020 సీజన్లో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా, భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా వంటి చాలామంది భారత క్రికెటర్లు గాయాలపాలైన సంగతి తెలిసిందే.