ఇషాన్ ద్విశతకం.. ఆ లెక్కన తొలి ఇండియన్ బ్యాటర్.. గతంలో డబుల్ హండ్రెడ్ వీరులు వీళ్లే..
Ishan Kishan double Hundred: బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయి ఆడాడు. 131 బంతుల్లోనే 24 ఫోర్లు, పది సిక్సర్లతో 210 పరుగులు చేశాడు. తద్వారా పలు రికార్డులు నెలకొల్పాడు.
బంగ్లాదేశ్ పర్యటనలో వరుసగా రెండు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా తొలిసారి ఈ సిరీస్ లో ఆధిక్యం ప్రదర్శించింది. ఇషాన్ కిషన్ పుణ్యమా అని భారత స్కోరుబోర్డు రాకెట్ కంటే వేగంగా పరిగెత్తింది. రోహిత్ గాయపడటం తో టీమ్ లోకి వచ్చిన ఇషాన్.. తనకు అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
శిఖర్ ధావన్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్.. ఆది నుంచి దూకుడుగానే ఆడాడు. బౌండరీలు, సిక్సర్లతో దుమ్మురేపిన ఇషాన్.. 85 బంతులలోనే సెంచరీ చేశాడు. ఇందులో 14 ఫోర్లు, రెండు సెంచరీలు ఉన్నాయి. సెంచరీ అయ్యాక ఇషాన్ రాకెట్ స్పీడ్ తో రెచ్చిపోయాడు. సిక్సర్ల తో బంగ్లా బౌలర్లపై దండయాత్రకు దిగాడు.
సెంచరీ నుంచి డబుల్ సెంచరీకి చేరడానికి ఇషాన్ కు 31 బంతులే కావాల్సి వచ్చాయి. 126 బంతుల్లో ఇషాన్ డబుల్ సెంచరీ పూర్తయింది. డబుల్ సెంచరీ చేయడం ద్వారా ఇషాన్.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా రికార్డులకెక్కాడు.
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రోహత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ లు ముగ్గురూ రైట్ హ్యాండ్ బ్యాటర్లే కావడం గమనార్హం. ఇక ఇషాన్ డబుల్ సెంచరీ భారత్ కు జట్టుగా ఆరో డబుల్ హండ్రెడ్. రోహిత్ శర్మ (264, 209, 208) మూడు ద్విశతకాలు చేయగా వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ లు తలా ఒకటి చేశారు. ఇప్పుడు ఇసాన్ చేసింది ఆరోది. జట్టుగా ఇన్ని డబుల్ లు చేసేనిజట్టు మరోటి లేదు.
ఈ మ్యాచ్ లో ద్విశతకం బాదడం ద్వారా ఇషాన్ మరో ఘనత అందుకున్నాడు. ఇప్పటివరకు డబుల్ సెంచరీలు చేసిన రోహిత్, సచిన్, సెహ్వాగ్ లు భారత్ లోనే స్వదేశంలోనే ఈ ఘనత అందుకున్నారు. సచిన్ గ్వాలియర్ లో డబుల్ సెంచరీ చేయగా రోహిత్ (మొహాలీ, బెంగళూరు, ఈడెన్ గార్డెన్) లో సాధించాడు.
వీరేంద్ర సెహ్వాగ్ ఇండోర్ లో డబుల్ అందుకున్నాడు. ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ లో ఈ ఘనత సాధించడం విశేషం. అంతేగాక అతి తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఘనత కూడా ఇషాన్ పేరు మీదే ఉంది.