- Home
- Sports
- Cricket
- IPL2022 Auction: పాల్ వాల్తేటీ, గోనీ, కమ్రాన్ ఖాన్... ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగి, మాయమైన క్రికెటర్లు..
IPL2022 Auction: పాల్ వాల్తేటీ, గోనీ, కమ్రాన్ ఖాన్... ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగి, మాయమైన క్రికెటర్లు..
ఐపీఎల్... టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు తిరుగులేని రాచమార్గం. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అదరగొట్టి, ఆ పర్ఫామెన్స్తోనే టీమిండియాలోకి దూసుకొచ్చాడు జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, నటరాజన్, వరుణ్ చక్రవర్తి వంటి క్రికెటర్లు...

ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించి, ఆ తర్వాతి సీజన్లో ఫెయిలై తెరమరుగైన క్రికెటర్లు కూడా ఎందరో ఉన్నారు. అలా ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగి, మాయమైన భారత క్రికెటర్లు వీరే...
పాల్ వాల్తేటి: పంజాబ్ కింగ్స్ తరుపున 2011 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్పై అద్భుత సెంచరీ చేసి, క్రికెట్ ప్రపంచంలో క్రేజీ స్టార్గా మారిపోయాడు పాల్ వాల్దేటి. 2011 సీజన్లో 136.98 స్ట్రైయిక్ రేటుతో 463 పరుగులు చేసిన పాల్ వాల్తేటి, ఆ తర్వాతి సీజన్లలో ఆకట్టుకోలేకపోయాడు. కంటి గాయంతో క్రికెట్కి దూరమై, ఎయిర్ ఇండియాలో ఉద్యోగిగా సెటిల్ అయ్యాడు పాల్ వాల్తేటి...
స్వప్నిల్ అస్నోద్కర్: ఐపీఎల్ మొదటి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున అదరగొట్టిన స్వప్నిల్, 133.47 స్ట్రైయిక్ రేటుతో 311 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత మూడు సీజన్లలో ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయిన స్వప్నిల్, ఆ తర్వాత ఐపీఎల్లో కనిపించలేదు...
మన్ప్రీత్ గోనీ: ఐపీఎల్ 2008 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఎంట్రీ ఇచ్చిన గోనీ, 7.38 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మన్ప్రీత్ గోనీ, డెక్కన్ ఛార్జర్స్, పంజాబ్, గుజరాత్ లయన్స్ తరుపున ఆడాడు... రిటైర్మెంట్ తర్వాత ఇండియా లెజెండ్స్ తరుపున ఆడి, భారీ సిక్సర్లతో తన సత్తా చాటాడు గోనీ...
పర్వీందర్ అవాన: 2012 ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆరంగ్రేటం చేశాడు పర్వీందర్ అవాన. 12 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన పర్వీందర్, ఆ తర్వాతి సీజన్లో 15 వికెట్లు తీశాడు. 2014 సీజన్లో 7 వికెట్లే తీసిన పర్వీందర్ను, 2015లో పంజాబ్ కింగ్స్ తిరిగి కొనుగోలు చేసిన తుదిజట్టులో ఆడే అవకాశం దక్కలేదు...
కమ్రాన్ ఖాన్: ఐపీఎల్ 2009లో సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు కమ్రాన్ ఖాన్. ఫస్ట్ క్లాస్ అనుభవం లేని కమ్రాన్ ఖాన్ని ఓ టీ20 టోర్నీలో చూసి ఐపీఎల్కి తీసుకొచ్చాడు రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్.
140కి.మీ.ల వేగంతో బంతులు విసిరిన కమ్రాన్ ఖాన్, తన రెండు సీజన్లలో 9 వికెట్లు తీశాడు. 2011లో పూణే వారియర్స్కి మారిన కమ్రాన్ ఖాన్, ఒకే మ్యాచ్ ఆడి 3 ఓవర్లలో 47 పరుగులు సమర్పించాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో క్రికెట్ మానేసి, వ్యవసాయం చేసుకుంటున్నాడు కమ్రాన్ ఖాన్...
మన్విందర్ బిస్లా: 2012 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ తరుపున 89 పరుగులు చేసి, టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు మన్విందర్ బిస్లా. అంతకుముదు డెక్కన్ ఛార్జర్స్, పంజాబ్ తరుపున ఆడిన మన్విందర్, 2015 సీజన్లో ఆర్సీబీ తరుపున ఆడాడు. అయితే పెద్దగా అవకాశాలు రాకపోవడంతో భారత జట్టుకి రాజీనామా చేసి, 2020 సీజన్లో లంక ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నాడు మన్విందర్ బిస్లా...
రాహుల్ శర్మ: 2010లో డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన స్పిన్నర్ రాహుల్ శర్మ, పూణే వారియర్స్ తరుపున అదరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. 2011 సీజన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన రాహుల్ శర్మకి టీమిండియా నుంచి కూడా పిలుపు దక్కింది. భారత జట్టు తరుపున 4 వన్డేలు, 2 టీ20 మ్యాచులు ఆడిన రాహుల్ శర్మ, 2013 సీజన్లో రేవ్ పార్టీ స్కాండల్లో ఇరుక్కుని తెరమరుగయ్యాడు.