IPL 2022: ఆ ముగ్గుర్నీ ఎంచుకోవడానికి ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలకు డేట్ ఫిక్స్ చేసిన బీసీసీఐ..?
IPL 2022 Auction: వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడనున్న రెండు కొత్త ఫ్రాంచైజీలు మెగా వేలం ముందు మరో పని చేయాల్సి ఉంది. అందుకు గాను బీసీసీఐ ఆయా సంస్థలకు తుది గడువును ప్రకటించినట్టు సమాచారం.
ఐపీఎల్-2022 లో భాగంగా తర్వాత జరుగబోయే సీజన్ కోసం నిర్వహించబోయే మెగా వేలానికి ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది.
ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు ఫ్రాంచైజీ (లక్నో, అహ్మదాబాద్) లు.. ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం బీసీసీఐ కల్పించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఇప్పటికే 8 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను గాక ఆయా జట్లలో మిగిలిపోయిన ఆటగాళ్లలో ముగ్గురు క్రికెటర్లను ఎంపిక చేసుకునే అవకాశం కొత్త ఫ్రాంచైజీలకు ఉంది. అయితే ఇందుకు గాను తుది గడువును బీసీసీఐ ఖరారు చేసినట్టు సమాచారం.
జనవరి 31 లోపు ఆ పనిని పూర్తి చేసుకోవాలని ఆయా ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే తెలిపినట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. లక్నో, అహ్మదాబాద్ లు తలో ముగ్గురుని ఎంపిక చేసుకున్న అనంతరం.. ఐపీఎల్ వేలం నిర్వహించే వేదిక, తేది పై స్పష్టత వచ్చే అవకాశముంది.
గతంలో ముగ్గురు ప్లేయర్లను ఎంపికచేసుకోవడానికి 2021 డిసెంబర్ 25ను గడువు తేదీగా నిర్ణయించినా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్ పై వచ్చిన బెట్టింగ్ ఆరోపణలతో ఇది వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
అయితే సీవీసీపై విచారణ చేపట్టిన ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ.. దానికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీనిపై త్వరలోనే బీసీసీఐ ఒక ప్రకటన చేసే అవకాశముంది.
సీవీసీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ రాగానే ఆ జట్టు.. వేలానికి ముందు చేసుకోవాల్సిన పనులపై దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్, కోచ్ గా ఆశిష్ నెహ్రా, మెంటార్ గా గ్యారీ కిర్స్టెన్ ను నియమించుకున్నట్టు (ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ) వార్తలు వస్తున్నాయి.
సీవీసీతో పాటు సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని మరో ఫ్రాంచైజీ లక్నో కూడా ఇప్పటికే హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటార్, ఇతర కోచింగ్ స్టాఫ్ ను నియమించుకుంది. కెప్టెన్ (కెఎల్ రాహుల్ అని ప్రచారం) గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.