IPL 2025 KKR vs RCB: ఐపీఎల్ లో ఒకేఒక్కడు.. విరాట్ కోహ్లీ
KKR vs RCB: ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో కేకేఆర్ బౌలింగ్ ను దంచికొట్టాడు. రికార్డుల మోత మోగించాడు.

Image Credit: Getty Images
IPL 2025 KKR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్లో ఘనంగా ప్రారంభం అయింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లు తలపడ్డాయి. ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో ఆర్సీబీ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది. 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులతో విక్టరీ సాధించింది.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ లో చివరివరకు క్రీజులో ఉండి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. కోహ్లీ 36 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. కింగ్ కోహ్లీ తన జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా అనేక రికార్డులు బద్దలుకొట్టాడు.
ఐపీఎల్ కింగ్ కోహ్లీ చరిత్ర
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం సందర్భంగా విరాట్ కోహ్లీని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ "ఐపీఎల్ 18" మెమెంటోతో సత్కరించారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీతోనే ఉన్నాడు. అలాగే, కోహ్లీ 2011 నుండి 2023 వరకు ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించాడు.
ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ లో 253 మ్యాచ్ లను ఆడిన కోహ్లీ 8063 పరుగులు చేశాడు. అలాగే, రికార్డు స్థాయిలో 8 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2016 సీజన్లో నాలుగు సెంచరీలతో 973 పరుగులు చేసి కొత్త రికార్డు సాధించాడు. అయితే, కోహ్లీ తన టీమ్ ను ఐపీఎల్ లో ఛాంపియన్ గా నిలబెట్టలేకపోయాడు. ఇంకా ఐపీఎల్ ట్రోఫీని గెలవని కోహ్లీ టీమ్ ఈ సారి ఐపీఎల్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. దానికి అనుగుణంగానే కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. కోహ్లీ సూపర్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో అజేయంగా నిలిచాడు.
అలాగే, కేకేఆర్ తో ఆడిన మ్యాచ్ తో కలిపి కోహ్లీ టీ20 క్రికెట్లో 400వ మ్యాచ్ ను ఆడాడు. తన కెరీర్ లో ఇది ఒక గొప్ప మైలురాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నాలుగు జట్లపై 1000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా చరిత్ర పుస్తకాల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. శనివారం కేకేఆర్ పై కోహ్లీకి 35వ ఐపీఎల్ మ్యాచ్ ను ఆడాడు.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన కార్యక్రమంలో 'ఐపీఎల్ ఓజీ' విరాట్ కోహ్లీని షారుఖ్ ఖాన్ వేదికపైకి స్వాగతించడంతో స్టేడియం హోరెత్తిపోయింది. "కోహ్లీ! కోహ్లీ!" అనే నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. 2008 ప్రారంభ సీజన్ నుండి ఇప్పటివరకు తాను సాగిస్తున్న ప్రయాణం అద్బుతమైనదని పేర్కొన్నాడు. అలాగే, షారుఖ్ ఖాన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు.