రోహిత్, హార్ధిక్ పాండ్యా నా రూమ్కి వచ్చి, అలా చేశారు, కళ్లల్లో నీళ్లు తిరిగాయి... కృష్ణప్ప గౌతమ్...
ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు కృష్ణప్ప గౌతమ్. కర్ణాటక స్పిన్ ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ను రూ.9 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసిన కృష్ణప్ప గౌతమ్, ప్రస్తుతం నెట్బౌలర్గా టీమిండియాకు సేవలందిస్తున్నాడు.
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా... చెన్నైలో రెండు టెస్టులు ముగించుకుని, మిగిలిన రెండు టెస్టుల కోసం అహ్మదాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే...
ఇంగ్లాండ్తో సిరీస్కి నెట్ బౌలర్గా ఎంపికైన కృష్ణప్ప గౌతమ్కు వేలంలో భారీ ధర దక్కింది. బేస్ ప్రైజ్ రూ.20 లక్షలతో మొదలైన కృష్ణప్ప గౌతమ్ను కొనుగోలు చేసేందుకు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. ఆఖరికి చెన్నై సూపర్ కింగ్స్ రూ.9 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి అతన్ని దక్కించుకుంది.
‘అహ్మదాబాద్ వచ్చి, హోటల్ రూమ్లో దిగాం. టీవీ పెట్టగానే నా పేరు కనిపించింది. నా కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడడం చూసి ఆశ్చర్యపోయాను. ధర పెరిగే కొద్దీ, నాలో ఒత్తిడి పెరిగిపోయింది...
చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసినట్టు చెప్పగానే, ఆనందంతో ఎగిరి గంతులేశాను... అప్పుడు నా డోర్ కొట్టినట్టు చప్పుడు కావడంతో వెళ్లి చూశాను. రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా వచ్చారు...
డోర్ తీయగానే... ‘కంగ్రాట్స్... ట్రీట్ ఇవ్వడానికి రెఢీగా ఉండు’ అంటూ ఇద్దరూ నన్న కౌగిలించుకున్నారు... ఆ క్షణం నేను కుటుంబానికి దూరంగా ఉన్నాననే భావన నాకు దూరమైంది...
ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పటికే ఇంత భారీ మొత్తం దక్కించుకున్నానంటే నమ్మలేకపోతున్నా... ధోనీ భాయ్ కెప్టెన్సీలో ఆడడానికి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా...’ అంటూ తెలిపాడు కృష్ణప్ప గౌతమ్...
ఐపీఎల్ కెరీర్లో 24 మ్యాచులు ఆడిన కృష్ణప్ప గౌతమ్, 13 వికెట్లు తీసి 186 పరుగులు చేశాడు. గత సీజన్లో పంజాబ్ తరుపున ఆడిన కృష్ణప్ప గౌతమ్, కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది.
32 ఏళ్ల కృష్ణప్ప గౌతమ్... 32 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 116 వికెట్లు తీసి, 737 పరుగులు చేశాడు. 49 టీ20 మ్యాచులు ఆడి, 32 వికెట్లతో పాటు 454 పరుగులు చేశాడు.