IPL 2026: టాప్ గేర్లో సన్రైజర్స్.. ఐపీఎల్ టేబుల్ టాప్లోకి హైదరాబాద్
IPL 2026: పంజాబ్ కింగ్స్పై 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరుకుంది. పంజాబ్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది.

పంజాబ్ను పాతాళానికి తొక్కిన కావ్య పాప టీమ్.. టేబుల్ టాపర్గా SRH
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్కు చేరుతున్న కొద్దీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బుధవారం జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ను 33 పరుగుల తేడాతో చిత్తు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇప్పటివరకు టాప్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ను కిందికి నెట్టి, ఆరెంజ్ ఆర్మీ టాప్ ప్లేస్లోకి దూసుకెళ్లింది. వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్ కింగ్స్, ఇప్పుడు హ్యాట్రిక్ ఓటములతో సతమతమవుతోంది.
శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. పంజాబ్ మైండ్సెట్ మారాలి
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం పంజాబ్కు అస్సలు కలిసి రావడం లేదు. 2017 నుంచి ఇప్పటివరకు పంజాబ్ ఇక్కడ సన్రైజర్స్ను ఓడించలేకపోయింది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ ఓటమిపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. "మేము టోర్నీని అద్భుతంగా ప్రారంభించాం, కానీ ఇప్పుడు లయ తప్పాం. నెగెటివ్ ఆలోచనలు పక్కన పెట్టి మళ్ళీ పుంజుకోవాలి. గత మూడు మ్యాచ్లలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటాం" అని చెప్పుకొచ్చారు.
ఫీల్డింగ్ లోపాలు.. భారీ మూల్యం చెల్లించిన కింగ్స్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణయం బెడిసికొట్టింది. సన్రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. మొదట్లోనే ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఇచ్చిన క్యాచ్లను కూపర్ కానోలీ, శశాంక్ సింగ్, లాకీ ఫెర్గూసన్ వదిలేశారు. దీంతో హైదరాబాద్ 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. "మేము చాలా క్యాచ్లు డ్రాప్ చేశాం. లేదంటే స్కోరును మరో 30-40 పరుగులు తగ్గించే వాళ్ళం. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యాం" అని అయ్యర్ ఒప్పుకున్నారు.
పాయింట్ల పట్టికలో హైదరాబాద్ టాప్
ప్రస్తుతం సన్రైజర్స్ 14 పాయింట్లతో నెంబర్ వన్ ప్లేస్లో ఉండగా, పంజాబ్ రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ టాప్ 5లో ఉన్నాయి.
ఆరెంజ్ క్యాప్.. పర్పుల్ క్యాప్ రేసులో ఎవరున్నారు?
బ్యాటింగ్లో సన్రైజర్స్ ప్లేయర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. క్లాసెన్ 494 పరుగులతో టాప్లో ఉండగా, అభిషేక్ శర్మ 475 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ (RCB) 17 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈషాన్ మాలింగ (SRH) 16 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

