IPL 2025: క్రికెట్ లవర్స్ కు షాక్.. KKR vs RCB ఐపీఎల్ తొలి మ్యాచ్ రద్దు కానుందా?
IPL 2025 KKR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22న కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో ప్రారంభం కానుంది. కోల్కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే తొలి మ్యాచ్ రద్దు కానుందా? పూర్తి వివరాలు మీకోసం.

IPL 2025 KKR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఎడిషన్ మార్చి 22న ఘనంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 PM IST కు ప్రారంభం కానుంది. మ్యాచ్కు ముందు ఓపెనింగ్ సెరిమనీ సాయంత్రం 6:00 PM IST జరగనుంది. అయితే, తొలి మ్యాచ్ ను రద్దు అయ్యే అవకాశముంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ కు పొంచివున్న వర్షం ముప్పు !
ఐపీఎల్ 2025లో జరిగే తొలి మ్యాచ్ ను వర్షం దెబ్బకొట్టే అవకాశముంది. కోల్కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం.
అలాగే, మ్యాచ్ కు ముందు బాలీవుడ్ బిగ్ స్టార్స్ తో ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెరిమనీ జరగనుంది. ఈ కార్యక్రమంలో శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, దిశా పటానీల ప్రదర్శనలు కూడా ఉన్నాయి. అయితే, ప్రారంభ వేడుకలకు ప్రతికూల వాతావరణం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది.
మార్చి 22న కోల్కతాపై ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయనీ, అలాగే, ఈదురుగాలు వీస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పగటిపూట వర్షం పడే అవకాశం 74% ఉండగా, సాయంత్రం 90% ఉంటుందని Accuweather నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో వర్షం పడితే ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకలకు అంతరాయం కలగవచ్చు. అలాగే, తొలి మ్యాచ్ వర్షంలో మునిగిపోవచ్చు. ఒడిశా నుండి విదర్భ వరకు ద్రోణి, తూర్పు భారతదేశం మీదుగా గాలులు కలవడం వల్లే వాతావరణం అస్థిరంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏప్రిల్ 6న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్ను గౌహతికి మార్చనున్నారు. ఇప్పుడు తొలి మ్యాచ్ ను వర్షం బెదిరిస్తోంది. దీంతో ఈడెన్ గార్డెన్స్ లో రెండు ఐపీఎల్ 2025 మ్యాచ్పై ప్రభావం పడింది.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రతా కారణాలతో మ్యాచ్ను కోల్కతాలో నిర్వహించడం సమస్యలు తెచ్చిపెడుతుందని కోల్కతా పోలీసులు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి తెలిపారు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్లో 20,000కి పైగా ఊరేగింపులు నిర్వహించాలని యోచిస్తున్నట్లు వచ్చిన నివేదికల కారణంగా, భద్రతా సమస్యలు తలెత్తుతాయని భావించారు. ఈ క్రమంలోనే కోల్ కతా నుంచి మ్యాచ్ ను గౌహతికి మార్చనున్నారు.