MI vs LSG: బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ సూపర్ షో.. ముంబై చేతిలో లక్నో చిత్తు
IPL 2025 MI vs LSG: ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్ కు తోడుగా జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ వరుసగా 5వ విజయాన్ని అందుకుంది. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ ను 54 పరుగుల తేడాతో ఓడించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
IPL 2025 MI vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ముంబై ఇండియన్స్ దూకుడు కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో వరుసగా ఐదో విక్టరీని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి చేరింది.
ఐపీఎల్ 2025లో 45వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ - లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ముంబై జట్టు అదరగొడుతూ లక్నో టీమ్ ను 54 పరుగుల తేడాతో ఓడించింది. లక్నో చేతిలో ఈ సీజన్ లో ఎదురైన ఓటమికి ముంబై ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో ముంబై 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. ముంబై విజయంలో ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించారు.
Mumbai Indians
వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో టీమ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అదరగొట్టడంతో డబుల్ సెంచరీ స్కోర్ ను సాధించింది.
సూర్య కుమార్ యాదవ్ (54 పరుగులు), ర్యాన్ రికెల్టన్ (58 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది ముంబై జట్టు. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో లక్నోను బుమ్రా దెబ్బకొట్టాడు. దీంతో లక్నో టీమ్ 161 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా 4 వికెట్లు తీసి లక్నో కు షాక్ ఇచ్చాడు. ఈ సీజన్లో లక్నోకు ఇది 5వ ఓటమి కాగా, ముంబైకి ఇది 6వ విజయం.
Mumbai Indians
సూర్య కుమార్-ర్యాన్ రికెల్టన్ ధనాధన్ బ్యాటింగ్
సూర్య కుమార్ యాదవ్, ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించి అర్ధ సెంచరీలు సాధించారు. ఇది ముంబై విజయానికి పునాది వేసింది. రికెల్టన్ 58 పరుగుల ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లతో పాటు, నమన్ ధీర్ 25 పరుగులు, అరంగేట్ర ఆటగాడు కార్బిన్ బాష్ 20 పరుగులతో నాటౌట్గా నిలిచారు.
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. హిట్ మ్యాన్ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. తిలక్ వర్మ 6 పరుగులు చేసి అవుట్ కాగా, హార్దిక్ పాండ్యా 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
లక్నోను చెడుగుడు ఆడుకున్న బుమ్రా, బౌల్ట్
భారీ టార్గెట్ ను అందుకునే క్రమంలో లక్నో టీమ్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయింది. బుమ్రా ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలింగ్ చేయడానికి వచ్చి లక్నో దెబ్బకొట్టాడు. బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టాడు. నికోలస్ పూరన్, రిషబ్ పంత్ వికెట్లు తీయడంతో ముంబైకి మంచి టర్న్ అందించాడు విల్ జాక్స్.
Mumbai Indians
రిషబ్ పంత్ మళ్ళీ ఫెయిల్
60 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత తర్వాత బ్యాటింగ్కు వచ్చిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్లో తన పేలవమైన ఫామ్ ను కొనసాగించాడు. పంత్ కేవలం రెండు బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఐడెన్ మార్క్రమ్ (9), అబ్దుల్ సమద్ (2) కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. మిచెల్ మార్ష్ (34), నికోలస్ పూరన్ (27), ఆయుష్ బడోని (35), డేవిడ్ మిల్లర్ (24) ప్రయత్నించినా లక్నోకు విజయాన్ని అందించలేకపోయారు. ఈ ఓటమితో లక్నో జట్టు ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలోకి చేరింది.