ఉమేశ్ యాదవ్ సరికొత్త చరిత్ర.. అత్యధిక వికెట్ల వీరున్ని అధిగమించిన కేకేఆర్ పేసర్
IPL 2023: ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న ఉమేశ్ యాదవ్.. శనివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజపక్సను ఔట్ చేయడం ద్వారా అరుదైన ఘనతను అందుకున్నాడు.

టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్ లో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన విండీస్ మాజీ బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా కూడా నిలిచాడు.
ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న ఈ నాగ్పూర్ బౌలర్.. శనివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో భానుక రాజపక్స వికెట్ తీయడం ద్వారా ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
Image credit: Getty
పంజాబ్ కింగ్స్ పై ఐపీఎల్ లో ఉమేశ్ కు ఇది 34వ వికెట్. గతంలో ఈ రికార్డులు సీఎస్కే బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది. బ్రావో.. ముంబై ఇండియన్స్ పై 33 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఉమేశ్.. ఈ రికార్డును బ్రేక్ చేశాడు.
కాగా నిన్న పంజాబ్ - కేకేఆర్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఫలితం తేలడానికి మూడు ఓవర్ల ముందు వర్షం రావడంతో మ్యాచ్ ను విజేతను డక్వర్త్ లూయిస్ పద్ధతిలో తేల్చాల్సి వచ్చింది. వర్షం పడే సమయానికి విజయానికి కేకేఆర్ 7 పరుగుల దూరంలో నిలిచింది. దీంతో పంజాబ్.. సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది.
Image credit: PTI
మొహాలీ వేదికగా ముగిసిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భానుక రాజపక్స (50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ ధావన్ (40) ధాటిగా ఆడాడు. చివర్లో సామ్ కరన్.. 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
లక్ష్య ఛేదనలో కేకేఆర్.. 29 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయినా నితీశ్ రాణా (34), వెంకటేశ్ అయ్యర్ (34), ఆండ్రూ రసెల్ (35) లు ఆదుకోవడంతో 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మూడు ఓవర్లు వేసి 19 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసిన అర్ష్దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.