IPL 2023: మ్యాచ్ గెలిచినా సంజూ శాంసన్కు జరిమానా.. కారణమిదే..
IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య ముగిసిన ఉత్కంఠ పోరులో రాజస్తాన్ గెలిచినా కెప్టెన్ సంజూ శాంసన్ పై మాత్రం ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.

ఐపీఎల్ -16లో బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య ముగిసిన ఉత్కంఠ పోరులో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ ఉత్కంఠ పోరులో నెగ్గింది. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో ధోని ధమాకా సిక్సర్లతో మ్యాచ్ ను ఉత్కంఠగా మార్చాడు.
అయితే సందీప్ శర్మ సూపర్ బౌలింగ్ తో రాజస్తాన్ 3 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా రెండు సిక్సర్లు కొట్టి ధోని మ్యాచ్ ను థ్రిల్లింగ్ ఎండింగ్ కు మార్చినా సందీప్ చివర్లో యార్కర్లతో రాజస్తాన్ ను విజయం వరించింది.
ఈ మ్యాచ్ లో రాజస్తాన్ గెలిచినా కెప్టెన్ సంజూ శాంసన్ పై మాత్రం ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడమే ఇందుకు కారణం. స్లో ఓవర్ రేట్ కారణంగా సంజూ శాంసన్ కు రూ. 12 లక్షల జరిమానా విధించినట్టు ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు.
కాగా ఐపీఎల్ లో ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కున్న రెండో కెప్టెన్ సంజూ శాంసన్. రెండ్రోజుల క్రితం ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో డుప్లెసిస్ కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.
ఇక ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కోవడం శాంసన్ కు గతంలో కూడా అనుభవమే. ఐపీఎల్ 2021 సీజన్ లో అతడిపై రెండు సార్లు ఫైన్ పడింది. కాగా ఈ సీజన్ లో మరోసారి ఇలాగే జరిగితే శాంసన్ పై ఓ మ్యాచ్ నిషేధం కూడా పడే అవకాశం ఉంటుంది.
Image credit: PTI
చెన్నైతో మ్యాచ్ విషయానికొస్తే రాజస్తాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (52), పడిక్కల్ (38), అశ్విన్ (30) రాణించారు. అనంతరం చెన్నై..20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవాన్ కాన్వే (50) రాణించినా చివర్లో ధోని (32నాటౌట్), రవీంద్ర జడేజా (25 నాటౌట్) లు మెరుపులు మెరిపించినా చెన్నైకి ఓటమి తప్పలేదు.