ఆ ఇద్దరి సరసన చేరేందుకు మహేంద్రుడికి సూపర్ ఛాన్స్.. గుజరాత్ తో మ్యాచ్ లో సాధిస్తాడా..?
IPL 2023: ఐపీఎల్ లో నేటి నుంచి మొదలుకాబోయే 16వ సీజన్ లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, గత సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగనుంది.
ఐపీఎల్ - 16 టోర్నమెంట్ ఓపెనర్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన రికార్డుకు 24 పరుగుల దూరంలో నిలిచాడు. నేడు గుజరాత టైటాన్స్ తో జరిగే మ్యాచ్ లో గనక ఆ 24 పరగులు సాధిస్తే ధోని.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సరసన నిలుస్తాడు.
ప్రస్తుతం ఐపీఎల్ లో ధోని 4,978 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. మరో 24 పరుగులు చేస్తే ధోని.. ఐపీఎల్ లో ఐదువేల పరుగుల క్లబ్ లో చేరతాడు. ఈ లీగ్ లో ఐదు వేల పరుగుల క్లబ్ లో చేరిన క్రికెటర్లు ఆరుగురు మాత్రమే.
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ.. 223 మ్యాచ్ లు ఆడి 215 ఇన్నింగ్స్ లలో 6,624 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ఉన్న శిఖర్ ధావన్.. 206 మ్యాచ్ లు ఆడి 205 ఇన్నింగ్స్ లలో 6,244 రన్స్ చేశాడు. డేవిడ్ వార్నర్.. ఈ లీగ్ లో 167 మ్యాచ్ లు ఆడి 162 ఇన్నింగ్స్ లలో 5,881 పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 222 ఇన్నింగ్స్ లలో 5,879 రన్స్ సాధించాడు.
వీరితో పాటు సీఎస్కే మాజీ ఆటగాడు సురేశ్ రైనా.. 205 మ్యాచ్ లలో 200 ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు వచ్చి 5,528 రన్స్ చేశాడు. ఆర్సీబీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్.. 5,162 పరుగులు సాధించాడు. వీరి తర్వాత ధోని కూడా మరో 24 పరుగులు చేస్తే ఐదు వేల క్లబ్ లో చేరతాడు.
ఈ ఒక్క రికార్డే కాదు.. ధోని పేరిట ఐపీఎల్ లో లెక్కలేనన్ని రికార్డులున్నాయి. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే ధోని.. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి దుమ్ము రేపుతాడు. అలా చివర్లో వచ్చి 20 వ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ధోని. ఇప్పటివరకూ 20 వ ఓవర్లో వచ్చి ధోని చేసిన పరుగులు 564. మరే బ్యాటర్ ఇన్ని పరుగులు చేయలేదు.
కెప్టెన్ గా వంద మ్యాచ్ లను గెలిచిన సారథి మహేంద్రుడే. ఐపీఎల్ లో ధోని సారథిగా ఏకంగా 104 మ్యాచ్ లు గెలిచాడు. ధోని మొత్తంగా ఐపీఎల్ లో 234 (ఇందులో సీఎస్కేకు 196) మ్యాచ్ లు ఆడాడు. 206 ఇన్నింగ్స్ లలో 4,978 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ధోని సగటు 39.20 గా ఉండగా స్ట్రైక్ రేట్ 135.20గా ఉంది. ఐపీఎల్ లో ఎక్కువగా ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోని.. తాను ఆడిన ప్రతీ పొజిషన్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇలా సాధించిన ఒకే ఒక్క ఆటగాడు ధోని.