- Home
- Sports
- Cricket
- ముంబై ఇండియన్స్ని ముంచిన వాన... అసలు సంబంధం లేని ఆ ఒక్క మ్యాచ్ రిజల్ట్ వచ్చి ఉంటేనా....
ముంబై ఇండియన్స్ని ముంచిన వాన... అసలు సంబంధం లేని ఆ ఒక్క మ్యాచ్ రిజల్ట్ వచ్చి ఉంటేనా....
ఐపీఎల్లో ప్రతీసారీ అకాల వర్షాలతో కొన్ని మ్యాచులు ఫలితం తేలకుండానే రద్దు కావడం కామన్. అయితే ఈ సీజన్లో మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ తప్ప అన్ని మ్యాచులు సజావుగానే జరిగాయి. వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దయిన ఆ ఒక్క మ్యాచ్ వల్ల ప్లేఆఫ్స్ వెళ్లాల్సిన జట్లే మారిపోయాయి...

లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ జెయింట్స్ జట్ల మధ్య లక్నోలో ఏకానా స్టేడియంలో మే 3న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది..
ఆయుష్ బదోనీ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నికోలస్ పూరన్ 31 బంతులాడి ఒక్క బౌండరీ లేకుండా 20 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్గా మొదటి మ్యాచ్ ఆడిన కృనాల్ పాండ్యా డకౌట్ అయ్యాడు..
లక్నో ఇన్నింగ్స్ ముగియడానికి 4 బంతుల ముందే వర్షం రావడంతో మ్యాచ్ని నిలిపివేశారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ని రద్దు చేస్తూ ఇరు జట్లకి చెరో పాయింట్ ఇచ్చారు.
ఇలా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాల్లో చేరిన ఆ ఒక్క పాయింటే, ఇప్పుడు ఆ రెండు టీమ్స్కి బోనస్గా మారింది.. మిగిలిన టీమ్స్కి ముఖ్యంగా ముంబై ఇండియన్స్కి దరిద్రంగా అంటుకుంది.
ఆ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయి ఉంటే 8 విజయాలతో 16 పాయింట్లతోనే ఉండేది. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో చేతుల్లో చిత్తుగా ఓడి ఉంటే సీఎస్కే ఖాతాలో 16 పాయింట్లు ఉండేవి. ఇది నాలుగు, ఆరు స్థానాల్లో ఉన్న ఆర్సీబీ, ముంబై ఇండియన్స్కి కలిసి వచ్చేది..
ముఖ్యంగా 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, చివరి మ్యాచ్లో గెలిస్తే 16 పాయింట్లకు చేరుకుంటుంది. అయినా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ కాదు. ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుంది..
Rohit Sharma
చాలా సీజన్లలో లక్ కలిసి రావడంలో ప్లేఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్, ఈ సారి మాత్రం వర్షం రూపంలో అది కూడా తమ టీమ్కి సంబంధం లేని మ్యాచ్లో రిజల్ట్ రాకపోవడంతో బ్యాడ్ లక్ వెంటాడి ప్లేఆఫ్స్ ఛాన్స్ మిస్ చేసుకునే ప్రమాదంలో పడింది..
అయితే అక్కడ ముంబైకి మంట పెట్టిన వరుణుడు, ఈసారి ఆ టీమ్కి సాయం చేసే అవకాశం ఉంది. బెంగళూరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కి వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియచేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఫలితం తేలకపోతే సన్రైజర్స్పై గెలిస్తే చాలు, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరుకుంటుంది..