హర్షా భోగ్లేకు కౌంటర్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్.. నవ్వుతూనే దింపేశాడు..!
IPL 2023: ఐపీఎల్ - 16లో భాగంగా ఆదివారం హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో శిఖర్ ధావన్ ఒంటరిపోరాటం చేశాడు.

ఐపీఎల్ -16లో ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్ ఒంటరిపోరాటం చేశాడు. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరు చేయడానికే నానా తంటాలు పడుతున్న వేళ ధావన్.. 10 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మోహిత్ రాఠీ తో కలిసి పంజాబ్ స్కోరును 140 మార్క్ దాటించాడు.
పంజాబ్ బ్యాటర్లను గడగడలాడించిన హైదరాబాద్ బౌలర్లను ఆటాడుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత దొరికిన బంతిని దొరికనట్టుగా బాదాడు. నిన్నటి మ్యాచ్ లో 66 బంతుల్లో 12 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒక్క పరుగు చేస్తే ధావన్ ఈ సీజన్ లో తొలి సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచేవాడు.
Image credit: PTI
42 బంతుల్లో 50 పరుగులు చేసిన ధావన్.. ఆ తర్వాత 44 పరుగులు చేయడానికి 24 పరుగులే తీసుకున్నాడు. నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ ల బౌలింగ్ లో వీరబాదుడు బాదాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మాటల్లో నవ్వుకుంటూనే ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేకు కౌంటర్ ఇచ్చాడు.
హర్షా.. గువహతిలో రాజస్తాన్ తో పంజాబ్ ఆడిన మ్యాచ్ లో ధావన్ బ్యాటింగ్ పై విమర్శలు చేశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో కూడా ధావన్.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 రన్స్ చేశాడు. కానీ ఈ క్రమంలో అతడు మొదట్లో మరీ నెమ్మదిగా ఆడి ఆఖర్లో బ్యాట్ ఝుళిపించాడు. అప్పుడు హర్షా.. ధావన్ రాజస్తాన్ తో మ్యాచ్ ఆరంభంలో సింగిల్స్ మాత్రమే తీశాడు. జట్టులో ధావన్ కీలక ఆటగాడా..? లేదా..? అన్న సందేహం కలుగుతోందని ట్వీట్ చేశాడు. ధావన్ స్ట్రైక్ రేట్ పైనా హర్షా విమర్శలు చేశాడు.
అయితే హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం ధావన్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడానికి రాగా అతడు హర్షాతో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చాడు. ‘ఇప్పుడు నా స్ట్రైక్ రేట్ పై మీరు సంతోషంగా ఉన్నారా..?’ అని నవ్వుతూనే సెటైర్లు వేశాడు. అప్పుడు భోగ్లే.. ‘జట్టు కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో మీరు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. మీ స్ట్రైక్ రేట్ కూడా బాగుంది..’ అని చెప్పాడు.
కాగా ఈ మ్యాచ్ లో ధావన్ తప్ప మిగిలినవారు తేలిపోవడంతో రెండు విజయాల తర్వాత పంజాబ్ కు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేయగా లక్ష్యాన్ని హైదరాబాద్.. 17.1 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.