ఆడనోన్ని తీసుకుని నెత్తిన పెట్టుకోమంటారా..? పృథ్వీ షా పై పాంటింగ్ ఆగ్రహం
IPL 2023: ఈ సీజన్ లో వరుస వైఫల్యాలతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చోటు కోల్పోయిన యువ ఓపెనర్ పృథ్వీ షా ఆటతీరుపై ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్-16లో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఫెయిలైన వారిలో పృథ్వీ షా ఒకడు. ఆడిన ఆరు మ్యాచ్ లలో రెండు డకౌట్లు అయి 20 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయిన షా.. ఆరు మ్యాచ్ ల తర్వాత ఏకంగా టీమ్ లోనే చోటు కోల్పోయాడు. ఆరు మ్యాచ్ లు ఆడిన షా.. 47 పరుగులే చేశాడు. హయ్యస్ట్ స్కోరు 15.
రిషభ్ పంత్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై టీమ్ కు దూరమైన నేపథ్యంలో ఢిల్లీ జట్లు షా మీద భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఢిల్లీతో సుదీర్ఘకాలంగా ఉంటున్న తనను కాదని 2022 వేలానికి ముందు వచ్చిన డేవిడ్ వార్నర్ కు కెప్టెన్సీ ఇవ్వడం నచ్చకే పృథ్వీ ఇలా ఆడుతున్నాడని గుసగుసలు వినిపించాయి.
ఏదేమైనా భారత జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ అంతటివాడు అవుతాడనుకుంటే నానాటికీ తన చెత్త ప్రదర్శనలతో తీవ్ర విమర్శలపాలవుతున్న పృథ్వీపై సాక్షాత్తూ ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఏమాత్రం ఆడని ప్లేయర్ ను తీసుకొచ్చి మా నెత్తిన పెట్టుకోమంటారా..? అని కామెంట్స్ చేశాడు.
రెండ్రోజుల క్రితం చెన్నై - ఢిల్లీ మధ్య ముగిసిన మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి తర్వాత పాంటింగ్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ లో మేం పృథ్వీపై భారీ ఆశలు పెట్టుకున్నాం. కానీ అతడు మేం ఆశించిన మేరకు రాణించడంలేదు. వరుసగా ఆరు మ్యాచ్ లలో ఆడించినా అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
తన పేలవ ప్రదర్శన కారణంగా షా టీమ్ లో ప్లేస్ కోల్పోతే వేరే వాళ్ల కు అవకాశమిచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ అతడి ప్లేస్ లో వచ్చిన ఆటగాళ్లు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు...’అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క పృథ్వీ షా మాత్రమే కాదని, తమ టీమ్ లో ఉన్న భారత బ్యాటర్లు ఎవరూ ఈ సీజన్ లో సరిగ్గా ఆడలేదని పాంటిగ్ అన్నాడు.
ఈ సీజన్ ను వరుసగా ఐదు అపజయాలతో ఆరంభించి తర్వాత పడుతూ లేస్తూ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చెన్నైని ఫస్ట్ 167 పరుగులకే పరిమితం చేసిన ఢిల్లీ.. తర్వాత ఈజీ టార్గెట్ ను ఛేదించేందుకు తంటాలుపడి 140 పరుగుల వద్దే ఆగిపోయింది.