IPL 2023 Final: రిజర్వ్ డేను కూడా వరుణుడు ముంచెత్తితే..! తాలా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?
IPL 2023 Final CSK vs GT: ఐపీఎల్ -16 ఫైనల్ కు ఘనమైన ముగింపు లభిస్తుందనుకుంటే అనూహ్యంగా ఆదివారం అహ్మదాబాద్ను వర్షం ముంచెత్తింది.
Image credit: PTI
రెండు నెలల పాటు దేశంలో లెక్కలేని క్రికెట్ వినోదాన్ని పంచుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16 వ ఎడిషన్ లో ముగింపును ఘనంగా చేద్దామని భావించిన బీసీసీఐకి వరుణుడు షాకిచ్చాడు. ఆదివారం టాస్ వేసే సమయానికి ముందు మొదలైన వర్షం 11 గంటలైనా ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను నేటికి వాయిదా వేశారు.
ఫైనల్కు రిజర్వ్ డే ఉండటంతో నేడు అదే అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. అయితే వర్షం ముప్పు నిన్నటితోనే ముగిసిపోలేదు. వాతావారణ శాఖ అంచనా ప్రకారం సోమవారం రాత్రి 9 తర్వాత ఇక్కడ వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని సూచిస్తున్నాయి. నిన్నటంత కాకపోయినా వర్షం కురవడం అయితే పక్కా అని నివేదికలు సూచిస్తున్నాయి.
Image credit: PTI
అయితే నేడు 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యమవుతుందని భావిస్తున్న బీసీసీఐకి, అభిమానులకు ఇది కాస్త బ్యాడ్ న్యూసే. కానీ మ్యాచ్ సజావుగా సాగేందుకు అనువైన ఏర్పాట్లన్నీ చేసిన బీసీసీఐ.. 20 ఓవర్ల ఆట కుదరకుంటే 15, 10తో పాటు 5 ఓవర్ల మ్యాచ్ ద్వారా అయినా ఫలితం తేల్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అదీకాకుంటే చివరి ప్రయత్నంగా ‘సూపర్ ఓవర్’ ద్వారా అయినా ఫలితం నిర్ణయించే అవకాశాలున్నాయి.
కానీ వరుణుడు మాత్రం నిన్నట్లాగే అసలు ఒక్క బంతి కూడా వేయడానికి ఛాన్స్ ఇవ్వకుంటే ఏంటన్న అనుమానాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి. దీనికి బీసీసీఐ అధికారుల నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే.. పాయింట్ల పట్టికలో టాప్-1లో ఉన్న జట్టును విజేతగా ప్రకటించడం. ఈ లెక్కన చూస్తే డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్దే ఐపీఎల్-16 ట్రోఫీ అవుతుంది.
Image credit: PTI
లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్.. 14 మ్యాచ్ లు ఆడి పది గెలిచి 20 పాయింట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్. 14 మ్యాచ్ లు ఆడి 8 గెలిచి 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ లెక్కన గుజరాత్ కే ట్రోఫీ దక్కే అవకాశాలుంటాయి.
కానీ బీసీసీఐ ఇలా చేస్తే సీఎస్కే, తాలా ఫ్యాన్స్ ఊరుకుంటారా..? అసలే ఇది ధోనికి చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాలా అభిమానులంతా అతడు ఎక్కడ మ్యాచ్ జరిగినా తండోపతండాలుగా వచ్చి తమ మద్దతు చాటుతున్నారు.
రిటైర్మెంట్ కంటే ముందే చెన్నైని మరోసారి విజేతగా నిలిపేందుకు ధోని ఇప్పటివరకూ చేయగలిగిందంతా చేశాడు. కానీ ఇప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ట్రోఫీని పంచితే ఇద్దరికీ పంచాలి గానీ లీగ్ దశలో ప్రదర్శన కారణంగా గుజరాత్ కు ఇవ్వడం సరికాదని అదే జరిగితే మెరీనా తీరాన అల్లకల్లోలం పుట్టిస్తామని తమిళ తంబీలు వాగ్దానాలు చేస్తున్నారు.