టాప్లీ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చిన దినేశ్ కార్తీక్.. ఇంతకీ ఆడతాడా..? ఆడడా..?
IPL 2023: ఐపీఎల్ - 16 సీజన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో ప్రారంభించింది. ముంబై ఇండియన్స్ ను మట్టి కరిపించిన ఆ జట్టుకు రెండో మ్యాచ్ కు ముందు షాక్ తప్పేట్టు లేదు.

‘ఈసాలా కప్ నమ్దే’అంటూ నాలుగేండ్ల తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. విన్నింగ్ జోష్ లో ఉండగానే భారీ షాక్ తాకింది.
నిన్నటి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా.. ఆర్సీబీ పేసర్ రీస్ టాప్లీ గాయపడ్డాడు. కర్ణ్ శర్మ వేసిన 8వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ కొట్టిన షాట్ ను ఆపేందుకు గాను ముందుకు డైవ్ చేసిన టాప్లీ గాయపడ్డాడు. దీంతో అతడు నొప్పిని భరించలేక పెవిలియన్ చేరాడు. ముందుకు డైవ్ చేసే క్రమంలో టాప్లీ పక్కటెముకకు గాయమైందని ఆర్సీబీ వర్గాలు తెలిపాయి.
కాగా టాప్లీ ఎలా ఉన్నాడు..? ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్ లలో అతడు ఆడతాడా..? లేదా..? అన్న విషయాలపై ఆ జట్టు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. ముంబైతో మ్యాచ్ ముగిసిన తర్వాత జియో సినిమాస్ తో మాట్లాడుతూ... ‘అతడి భుజానికి గాయమైంది. మేము గేమ్ ఆడుతున్న క్రమంలోనే టాప్లీని స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించారు.
అయితే అతడి పరిస్థితి ఎలా ఉందనేదానిపై మాకు ఇంకా సమాచారం లేదు. మనం అనుకున్నంత నొప్పి అయితే అతడికి ఉంటుందని నేను అనుకోవడం లేదు. అతడు తిరిగి జట్టుతో చేరతాడని నేను అనుకుంటున్నా. టాప్లీ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం... ’ అని తెలిపాడు.
కాగా నిన్నటి మ్యాచ్ లో టాప్లీ.. 2 ఓవర్లు వేసి 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్.. రూ. 17 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్ ను టాప్లీ ఔట్ చేశాడు. అయితే గాయం తర్వాత మైదానాన్ని విడిచిన టాప్లీ మళ్లీ ఫీల్డింగ్ కు రాలేదు.
టాప్లీ ఆర్సీబీతో కలవడం ఆ జట్టుకు చాలా అవసరం. అసలే ఆ జట్టు కీలక బౌలర్ జోష్ హెజిల్వుడ్.. ఈ సీజన్ లో గాయం కారణంగా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో తొలి ఏడు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ఈనెల 20 తర్వాతే అతడు ఈ సీజన్ కు అందుబాటులో ఉంటాడు. ఈ నేపథ్యంలో టాప్లీ అయినా ఆర్సీబీ బౌలింగ్ కు బలాన్నిస్తాడనుకుంటే అతడు మాత్రం గాయంతో ఆడతాడో లేదోనన్న సందేహాలు వెలువడుతున్నాయి. ఈ సీజన్ లో ఆర్సీబీ.. తమ తర్వాతి మ్యాచ్ ను ఏప్రిల్ 6న కోల్కతాతో ఆడనుంది.