తొలిసారిగా రైనా లేకుండా చెన్నైలో మ్యాచ్ ఆడుతున్న సీఎస్కే... రుతురాజ్ గైక్వాడ్ ఆరంగ్రేటం...
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రెండో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలబడుతోంది. చెన్నైలోని చెపాక్ ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో మూడేళ్ల తర్వాత మ్యాచ్ ఆడబోతోంది సూపర్ కింగ్స్. చెపాక్లో సీఎస్కే, సురేష్ రైనా లేకుండా మ్యాచ్ ఆడుతుండడం ఇదే తొలిసారి...
ఐపీఎల్ 2019 సీజన్లో చెన్నైలోనే తొలి మ్యాచ్ ఆడిన సూపర్ కింగ్స్, మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ కూడా అక్కడే ఆడింది. వాస్తవానికి ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా చెన్నైలోనే ఆడాల్సింది. అయితే ఫైనల్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన అధికారిక పర్మిషన్లు తీసుకోవడంలో మేనేజ్మెంట్ ఆలస్యం చేయడంతో వైజాగ్లో ప్లేఆఫ్స్, హైదరాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది...
కరోనా కారణంగా యూఏఈలో ఐపీఎల్ 2020 సీజన్ మొత్తం సాగింది. 2021 సీజన్ ఇండియాలో జరిగినా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులు చెన్నైలో జరగలేదు. మధ్యలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో మ్యాచులు మళ్లీ యూఏఈకి మారాయి...
Image Credit: Getty Images
ఐపీఎల్ 2022 సీజన్కి ఇండియాలోనే నిర్వహించినా మ్యాచులు కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో 2022లో కూడా చెన్నైలో సీఎస్కే మ్యాచులు జరగలేదు. ఎట్టకేలకు మూడేళ్ల విరామం తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులు జరగబోతుండడంతో బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది...
చెపాక్ స్టేడియంలో సురేష్ రైనా లేకుండా మొట్టమొదటి మ్యాచ్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన సురేష్ రైనా, 2019 సీజన్ వరకూ సీఎస్కే ఆడిన దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ ఆడాడు... 2020 సీజన్ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న సురేష్ రైనా, 2021 సీజన్లో ఆడినా పెద్దగా మెప్పించలేకపోయాడు...
నాకౌట్ మ్యాచుల్లో సురేష్ రైనాని రిజర్వు బెంచ్లో కూర్చోబెట్టిన చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2022 మెగా వేలంలో అతన్ని తిరిగి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. సీఎస్కేకి తప్ప మరే ఫ్రాంఛైజీకి ఆడనని గతంలో సురేష్ రైనా వీర లెవెల్లో కామెంట్లు చేయడంతో ఏ ఫ్రాంఛైజీ కూడా అతన్ని కొనుగోలు చేయలేదు...
Image credit: PTI
2020లో చెన్నై సూపర్ కింగ్స్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్, మొట్టమొదటిసారిగా చెన్నైలో మ్యాచ్ ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో సురేష్ రైనాని కాదని, రుతురాజ్ గైక్వాడ్ని రిటైన్ చేసుకుంది సీఎస్కే... తొలి మ్యాచ్లో 92 పరుగులు చేసి సీఎస్కే తరుపున ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్కి, చెన్నై ఫ్యాన్స్ ఘన స్వాగతం పలకబోతున్నారు..