అసలు గెలవాలన్న కసి మాలో ఉంటే కదా.. ఈ బ్యాటింగ్తో అయితే కష్టమే : ఎస్ఆర్హెచ్ బ్యాటర్లపై మార్క్రమ్ ఆగ్రహం
IPL 2023: వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుని ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో అవమానకర ఓటమిని మూటగట్టుకుంది.
ఐపీఎల్ లో మిగిలిన జట్లు ఆడిన మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నా.. సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్త ఆట మాత్రం మారడం లేదు. బౌలర్లు రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యాలతో ఆ జట్టు దారుణ పరాజయాలను మూటగట్టుకుని హ్యాట్రిక్ ఓటములు నమోదుచేసింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01gy00brfcy6fydpa5aqv2fc4v/srh_300x169xt.jpg)
ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడి తర్వాత రెండింటిలో గెలిచిన ఎస్ఆర్హెచ్.. మళ్లీ ఓటముల ఊబిలో కూరుకుపోతున్నది. ముంబై, చెన్నైల చేతిలో ఓడిన సన్ రైజర్స్ నిన్న ఢిల్లీ చేతిలో కూడా చావుదెబ్బ తింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ సారథి ఎయిడెన్ మార్క్రమ్ జట్టు ప్రదర్శనపై ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యాలపై తీవ్రంగా స్పందించాడు.
‘మా జట్టు బ్యాటింగ్ లో మళ్లీ విఫలమైంది. అసలు మ్యాచ్ గెలవాలన్న కసి మా బ్యాటింగ్ (ఆటగాళ్ల)లో కనిపించలేదు. దీని నుంచి మేం పాఠాలు నేర్చుకోవాలి. టార్గెట్ ను ఛేజ్ చేసేప్పుడు మరింత జాగ్రత్తగా ఆడాలి. టీమ్ లో ఆటగాళ్లంతా స్వేచ్ఛగా, కలిసికట్టుగా ఎలా ఆడాలో నేర్చుకోవాలి..’అని ఫైర్ అయ్యాడు.
నిన్నటి హైదరాబాద్ - ఢిల్లీ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వార్నర్ సేన.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కానీ స్వల్ప లక్ష్య ఛేదనలో కూడా హైదరాబాద్ తడబడింది. హ్యారీ బ్రూక్ (7), రాహుల్ త్రిపాఠి (15), అభిషేక్ శర్మ (5), మార్క్రమ్ (3) లు దారుణంగా విఫలమయ్యారు. మయాంక్ అగర్వాల్ (49), హెన్రిచ్ క్లాసెన్ (31) ఫర్వాలేదనిపించినా వాళ్లు మ్యాచ్ ను గెలిపించలేకపోయారు.
అయితే జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా వారిలో ఉత్తమంగా ఆడాలన్న శ్రద్ధ కనిపించడం లేదని మార్క్రమ్ మ్యాచ్ ముగిశాక చెప్పాడు. దానివల్లే తాము నిరాశచెందాల్సి వస్తుందని అన్నాడు. ఈ మ్యాచ్ లో పరాజయానికి బౌలర్లు ఏమాత్రం కారణం కాదని, వారిని ఇలా ఓటమి వైపు ఉంచడం బాధగా ఉందని మార్క్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు ఆకట్టుకున్నారు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. 4 ఓవర్లు వేసి 11 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టి 28 రన్స్ ఇచ్చాడు. నటరాజన్ కూడా 3 ఓవర్లు వేసి 21 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీశాడు.