- Home
- Sports
- Cricket
- IPL: కోహ్లి రాజీనామాను ఇంకా ఆమోదించని ఆర్సీబీ.. కీలక అప్డేట్ ఇచ్చిన విరాట్.. 12న చెప్పేది అతడి పేరేనా..?
IPL: కోహ్లి రాజీనామాను ఇంకా ఆమోదించని ఆర్సీబీ.. కీలక అప్డేట్ ఇచ్చిన విరాట్.. 12న చెప్పేది అతడి పేరేనా..?
RCB New Captain: ఐపీఎల్ లో ఆర్సీబీకి 2013 నుంచి కెప్టెన్ గా ఉన్న కోహ్లి గత సీజన్ రెండో దశకు ముందు.. 2021 సీజన్ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తొమ్మిదేండ్లు సారథిగా ఉన్నా అతడు ఒక్కసీజన్ లో కూడా ఆర్సీబీకి కప్ అందించలేదు.

తొమ్మిదేండ్ల (2013-2021) పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును నడిపించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి గతేడాది ఐపీఎల్ రెండో దశ సందర్భంగా.. ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
దీంతో ఆర్సీబీకి ఈ ఏడాది సీజన్ లో కొత్త కెప్టెన్ ను వెతుక్కునే పనిని పెట్టాడు కోహ్లి. అయితే ఒకవైపు 2022 సీజన్ కు సమయం దగ్గరపడుతున్నా.. మరోవైపు ఆయా జట్లన్నీ ప్రాక్టీస్ కు ప్లేయర్లను సిద్ధం చేసుకుంటున్న వేళ.. ఆర్సీబీ మాత్రం ఇంకా కెప్టెన్ ఎవరు..? అన్న అంశంపై నాన్చుతూనే ఉంది.
ఈనెల 12న తమ జట్టు కెప్టెన్ ఎవరు..? అనే విషయంపై స్పష్టత వస్తుందని, అదే రోజు అతడి పేరును ప్రకటిస్తామని ఆర్సీబీ ఇటీవలే సామాజిక మాధ్యమాలలో ఓ పోస్టును ఉంచింది. దీంతో కొత్త కెప్టెన్ ఎవరై ఉంటారా..? అని ఆ జట్టు అభిమానులతో పాటు ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా ఆర్సీబీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గతేడాది తాను ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు కోహ్లి ప్రకటించినా.. అందుకు సంబంధించిన రాజీనామాను ఆర్సీబీ యాజమాన్యం ఇంకా ఆమోదించలేదట.
కోహ్లి రాజీనామాను అధికారికంగా ఆమోదించని ఆర్సీబీ.. బుధవారం అతడు మాట్లాడిన ఓ వీడియోను కూడా ట్విట్టర్ లో పంచుకుంది. ఈ వీడియోలో కోహ్లి మాట్లాడుతూ... ‘కొత్త ఐపీఎల్ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. దాని కోసం మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు...’ అని చెప్పాడు.
ఆ తర్వాత విరాట్ మాట్లాడిన మాటలను ఆర్సీబీ మ్యూట్ చేసింది. ఈనెల 12న కోహ్లి మాట్లాడిన మాటలను రివీల్ చేస్తాం అని కూడా అందులో పేర్కొంది. దీంతో కోహ్లి అభిమానులకు హింట్ ఇచ్చినట్టే ఇచ్చిందని అతడి అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఫోటోలు, తాజా అప్డేట్లు చూస్తుంటే కోహ్లినే మళ్లీ సారథిగా చేయనున్నారని అతడి అభిమానులు అంటున్నారు. ‘విరాట్ భయ్యా.. మళ్లీ నువ్వే సారథిగా రావాలి. రెండ్రోజులు ఎందుకు.. ఇప్పుడే చెప్పేయ్..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కోహ్లిని మళ్లీ సారథిగా చేయాలనే వాదన అతడి అభిమానుల నుంచి వినిపిస్తున్నా అందుకు అతడు సిద్ధంగా లేడు. ఈ పక్షంలో సీఎస్కే మాజీ ఓపెనర్, దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ ను గానీ భారత వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ను గానీ సారథిగా నియమించే అవకాశాలున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
మరి ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఎవరనే విషయం తెలియాలంటే ఇంకో రెండ్రోజులు వేచి చూడాల్సిందే. ఈనెల 12న బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ లోని మ్యూజియం క్రాస్ రోడ్ లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 8 గంటల మధ్య కొత్త కెప్టెన్ కు సంబంధించిన కీలక అప్టేడ్ ఇస్తామని ఆర్సీబీ తెలిపింది.