నో డీఆర్ఎస్! స్టేడియంలో పవర్ కట్ సమస్య... వేల కోట్ల ఐపీఎల్లో ఇంత దారుణమా...
ఐపీఎల్... బీసీసీఐకి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. అయితే తాజాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఓ సంఘటన, ఐపీఎల్ పరువు దిగజారేలా చేసింది...

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాంకేతిక సమస్యల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. ఫ్లడ్ లైట్స్ వెలగకపోవడంతో దాదాపు 5 నిమిషాల పాటు ఇరుజట్ల కెప్టెన్లు ఎదురుచూడాల్సి వచ్చింది...
5 నిమిషాల ఆలస్యం పెద్ద విషయం కాకపోవచ్చు. చాలా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్తో మ్యాచ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం కూడా పెద్దగా సమస్య కాదు. అయితే స్టేడియంలో పవర్ కట్ ఉన్నందున డీఆర్ఎస్ తీసుకునేందుకు అవకాశం లేదంటూ తేల్చేశారు రిఫరీలు...
ఇది చెన్నై సూపర్ కింగ్స్ను ఘోరంగా దెబ్బ తీసింది. డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతికే డివాన్ కాన్వేని ఎల్బీడబ్ల్యూ అవుట్గా ప్రకటించాడు అంపైర్... ఎల్బీడబ్ల్యూల విషయాల్లో చాలాసార్లు అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు, రివ్యూలో తారుమారు అయ్యాయి...
అయితే డీఆర్ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో బంతికే వన్డౌన్లో వచ్చిన మొయిన్ ఆలీ కూడా డకౌట్ అయ్యాడు...
టీవీ రిప్లైలో కాన్వే ఎదుర్కొన్న బంతి, లెగ్ స్టంప్ని మిస్ అవుతున్నట్టు కనిపించింది. దీంతో కీలక మ్యాచ్లో టెక్నికల్ ప్రాబ్లమ్, చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్ను కకావికలం చేసింది.
Daniel Sams
డానియల్ సామ్స్ బౌలింగ్లో హృతిక్ షోకీన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొయిన్ ఆలీ. మొదటి ఓవర్లో వైడ్ల రూపంలో చెన్నై సూపర్ కింగ్స్కి 3 పరుగులు రాగా, 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్లో రాబిన్ ఊతప్ప కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..
అప్పటికీ డీఆర్ఎస్ తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో ఊతప్ప 1 పరుగు చేసి నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 3 ఓవర్లు ముగిసే సమయానికి 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది...
ఐపీఎల్ 2022 సీజన్లో కొత్త ఫ్రాంఛైజీల బిడ్ల ద్వారా రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించిన బీసీసీఐ, మ్యాచుల నిర్వహణ విషయంలో ఇంత అద్వానంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.