- Home
- Sports
- Cricket
- IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్.. టీం బస్సుపై నవ నిర్మాణ సేన దాడి.. కారణమిదే..
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్.. టీం బస్సుపై నవ నిర్మాణ సేన దాడి.. కారణమిదే..
Delhi Capitals Bus Attacked: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. హోటల్ కు వస్తున్న ఆ జట్టు బస్సుపై దాడి జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా ప్రాబల్యం కోల్పోతున్న ఓ పార్టీ దీని వెనుక ఉన్నట్టు తెలుస్తున్నది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2022 సీజన్ కోసం సిద్ధమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఓ టీమ్ బస్సుపై దుండగులు దాడికి పాల్పడ్డారు.
ఐపీఎల్-15 నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన బస్.. లీగ్ సన్నాహాల కోసం వారికి కేటాయించిన తాజ్ మహల్ హోటల్ కు చేరుకుంటున్న క్రమంలో ఈ దాడి జరిగింది.
బస్ వద్దకు చేరుకున్న పలువురు దుండగులు.. అద్దాలకు కొన్ని పోస్టర్లు అతికించిన అనంతరం కర్రలు, రాడ్లతో వాటిని పగులగొట్టే యత్నం చేశారరు. మరాఠీలో నినాదాలు చేస్తూ అక్కడ్నుంచి వెళ్లినట్టు సీసీ టీవీ పుటేజీలలో రికార్డైంది.
అయితే రాజ్ థాక్రే నేతృత్వం వహిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కు చెందిన ట్రాన్స్పోర్ట్ విభాగం ఎంఎన్ఎస్-వాహతక్ సేన కార్యకర్తలు ఈ పని చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన నినాదాలు చేసుకుంటూ బస్ పై దాడి జరిపారు దుండగులు. ఐపీఎల్ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బస్ లను ఉపయోగించకుండా ఇతర రాష్ట్రాల బస్ లను మహారాష్ట్రకు తెస్తున్నారని, తద్వారా తమ ఉపాధి పోతుందని ఆరోపిస్తూ ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు.
విషయం తెలుసుకున్న ఆ జట్టు యాజమాన్యం, ఆటగాళ్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ దాడి జరుగుతున్న సమయంలో బస్ లో ఆటగాళ్లెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ దాడిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆరుగురు గుర్తు తెలియని దుండగుల మీద ఐపీసీ సెక్షన్ 143, 147, 149, 427 ల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు.
కాగా మార్చి 26 నుంచి ఐపీఎల్ తదుపరి సీజన్ మొదలుకానుండగా.. 27 న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి మ్యాచును ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. ఈ మేరకు ఆ జట్టు ఇప్పటికే సన్నాహకాలను ప్రారంభించింది.
ఈ మ్యాచ్ కంటే ముందే ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్, అసిస్టెంట్ కోచ్ జేమ్స్ హోప్స్ లు జట్టుతో జత కలిశారు. లంకతో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం ఆ జట్టు సారథి రిషభ్ పంత్ కూడా నేరుగా హోటల్ కు చేరుకున్నాడు.
ఇప్పటికే హోటల్ కు చేరుకున్న ఆటగాళ్లు, కోచ్ తో పాటు ఇతర సహాయక సిబ్బంది అంతా ప్రస్తుతం క్వారంటైన్ లో గడుపుతున్నారు. క్వారంటైన్ పూర్తయ్యాక ఆటగాళ్లంతా ప్రాక్టీస్ కు వెళ్లనున్నారు.