యూఏఈలోనే ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచులు... అధికారికంగా ఖరారు చేసిన బీసీసీఐ...
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులకు వేదిక ఖరారైంది. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్కి వేదిక నిచ్చిన యూఏఈలోనే 2021 సీజన్లో మిగిలిన మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
ఐపీఎల్ 2021 సెకండాఫ్తో పాటు టీ20 వరల్డ్కప్ గురించి నిర్ణయాలు తీసుకునేందుకు సమావేశమైన బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మిగిలిన మ్యాచుల నిర్వహణకే యూఏఈ బెస్ట్ ఆప్షన్గా తేల్చారు.
అందరూ భావించినట్టుగానే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనే మిగిలిన మ్యాచులను నిర్వహించబోతున్నారు. ఇంగ్లాండ్ టూర్కి వెళ్తున్న టీమిండియా, సెప్టెంబర్ 15న టూర్ను ముగించుకుంటుంది.
సెప్టెంబర్ 17 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ ప్రారంభమవుతుందని టాక్ నడుస్తోంది. అయితే సెకండాఫ్కి సంబంధించిన అధికారిక ప్రారంభ తేదీని ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా నిర్వహించి, సూపర్ సక్సెస్ సాధించింది బీసీసీఐ. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరిగిన మ్యాచులకు కూడా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చింది.
దుబాయ్తో పాటు షార్జాలో కూడా రికార్డు లెవెల్లో సిక్సర్ల వర్షం కురిసింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్, ముంబైకి ఐదో టైటిల్ అందివ్వగా, ఐపీఎల్లో ఘనమైన రికార్డున్న సీఎస్కే చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఐపీఎల్ 2021 సీజన్లో ఇప్పటికే 29 మ్యాచులు పూర్తికాగా, ఇంకా 31 మ్యాచులు జరగాల్సి ఉంది. వీటిని వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు 10 డబుల్ హెడ్ మ్యాచులు, 7 సింగిల్ మ్యాచులు, 4 ప్లేఆఫ్ మ్యాచులు నిర్వహించబోతున్నారని సమాచారం.
కరోనా కేసుల కారణంగా టోర్నీకి బ్రేక్ పడే సమయానికి ఆరు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి.