IPL 2021: ఆ చెత్తనంతా బయటికి తోసేయాలి, ఆ ముగ్గురినీ ఉంచుకుంటే చాలు... గౌతమ్ గంభీర్ కామెంట్...
ఐపీఎల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 14 సీజన్లుగా టైటిల్ మాత్రం గెలవలేకపోతోంది. ప్లేయర్లను మార్చినా, జెర్సీ మార్చినా, లోగో మార్చినా... ఆర్సీబీ రాత మాత్రం మారడం లేదు...
ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఆశించిన ఫలితం రాకపోవడంతో ఐపీఎల్ 2021 సీజన్లో టైటిల్ గెలిచి, కెప్టెన్సీకి ఘనంగా వీడ్కోలు పలకాలని ఆశించాడు విరాట్ కోహ్లీ...
కోహ్లీ ఆశలపై నీళ్లు చల్లుతూ ఐపీఎల్ 2021 సీజన్లోనూ నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ఐపీఎల్ 2022 సీజన్లో మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఆర్సీబీ ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటుంది? ఎవరిని వేలానికి విడుదల చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది...
తాజాగా కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఈ విషయం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు... ‘ఆర్సీబీలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. చేతుల దాకా వచ్చిన విజయాన్ని దూరం చేసే చెత్త కూడా ఉంది...
టైటిల్ గెలవాలని అనుకుంటే, ఆ చెత్తనంతా తీసి పడేయాలి. మెగా వేలానికి ముందు విరాట్ కోహ్లీ, యజ్వేంద్ర చాహాల్తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్ను రిటైన్ చేసుకుంటే చాలు...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్..
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా కూడా ఆర్సీబీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు... ‘ఆర్సీబీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది...
గ్లెన్ మ్యాక్స్వెల్, ఆర్సీబీలో సరిగ్గా కుదురుకుపోయాడు. ఈ సీజన్లో మ్యాక్సీ, ఆర్సీబీకి ఓ ఆయుధంలా ఉపయోగపడ్డాడు...
విరాట్ కోహ్లీ, కచ్ఛితంగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. కోహ్లీని వదులుకునే ప్రయత్నం ఆర్సీబీ చేయకపోవచ్చు... అతనితో మ్యాక్స్వెల్ని ఉంచుకోవడానికి ఆర్సీబీ ఆలోచించొచ్చు...
దేవ్దత్ పడిక్కల్ లాంటి యంగ్ ప్లేయర్ చాలా మెచ్యూరిటీతో క్రికెట్ ఆడుతున్నాడు. పడిక్కల్ను కూడా ఆర్సీబీ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది...
ఏబీ డివిల్లియర్స్ను మాత్రం ఎందుకు రిటైన్ చేసుకోవాలి. అతను పరుగులు చేయలేకపోతున్నాడు. వయసు కూడా పెరిగిపోతోంది...
ఏడాది మొత్తంలో ఆరువారాల పాటు ఐపీఎల్ సాగుతుంది. వచ్చే మూడు సీజన్ల పాటు అతను ఐపీఎల్కి అందుబాటులో ఉండగలడా... అలా ఉంటే, అతన్ని అట్టిపెట్టుకోండి...’ అంటూ కామెంట్ చేశాడు బ్రియాన్ లారా...