ఐపీఎల్ 2021 మినీ వేలం... ఈ క్రికెటర్లను కొనడానికి ఏ ఫ్రాంఛైజీ ఇష్టపడుతుంది...
ఐపీఎల్ 2021 మినీ వేలానికి ఊహించిన దానికంటే ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. ఎనిమిది ఫ్రాంఛైజీల నుంచి విడుదల చేయబడిన ప్లేయర్లతో పాటు బయటి నుంచి స్వచ్ఛందంగా వేలానికి రిజిస్టర్ చేయించుకున్న ప్లేయర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తంగా ఐపీఎల్ 2021 సీజన్లో ఖాళీగా ఉన్న 61 స్థానాల కోసం 1094 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో 814 మంది స్వదేశీ ప్లేయర్లు కాగా 15 దేశాలకు చెందిన 283 మంది విదేశీ ప్లేయర్లు ఐపీఎల్ 2021 మినీ వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో కొందరు ఆటగాళ్లను ఏ ఫ్రాంఛైజీ దక్కించుకుంటుందా? అని ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
ఛతేశ్వర్ పూజారా: ఆస్ట్రేలియా టూర్లో జిడ్డు బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టు బౌలర్ల ఓపికకి పరీక్ష పెట్టాడు ఛతేశ్వర్ పూజారా. ఆస్ట్రేలియా టూర్లో చేసిన మూడు హాఫ్ సెంచరీల్లోనూ, 50 పరుగులు చేయడానికి 190 బంతులు తీసుకున్న పూజారాని టీ20 లీగ్లో తీసుకోవడానికి ఫ్రాంఛైజీలు సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ ఏ జట్టు అయినా సాహం చేసిన పూజారాని బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు పెట్టి కొనుగోలు చేసినా, అతన్ని రిజర్వు బెంచ్కి పరిమితం చేసి యువ బ్యాట్స్మెన్కి సలహాలు ఇచ్చేందుకు మెంటర్లా వాడుకునే అవకాశం ఉంది...
హనుమ విహారి: పూర్తి టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందిన హనుమ విహారి కూడా ఐపీఎల్ 2021 మినీ వేలానికి రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే పూజారా బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు మాత్రమే అయితే విహారి కనీస ధర కోటి రూపాయలు. విహారి లాంటి టెస్టు ప్లేయర్ని కోటి పెట్టి ఎవ్వరూ కొనుగోలు చేయకపోవచ్చు. గత ఏడాది ఐపీఎల్ వేలంలోనూ విహారికి నిరాశ తప్పలేదు..
కరణ్ నాయర్: భారత మాజీ క్రికెటర్ వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ కరణ్ నాయర్. ఈ యంగ్ సెన్సేషన్కి ఆ ఇన్నింగ్స్ తర్వాత మరో ఛాన్స్ దక్కలేదు. టీ20ల్లో దూకుడుగా ఆడగల కరణ్ నాయర్కి గత ఐపీఎల్ సీజన్లో కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే అవకాశం దక్కింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున 4 మ్యాచుల్లో 16 పరుగులు చేసిన కరణ్ నాయర్, ఐపీఎల్ 2021 మినీ వేలంలో నిలిచాడు. మొత్తంగా 73 మ్యాచుల్లో దాదాపు 1500 పరుగులు చేసిన కరణ్ నాయర్కి, 2018 సీజన్ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కలేదు.
కేదార్ జాదవ్: ఐపీఎల్ 2020 సీజన్లో ఘోరమైన ప్రదర్శన ఇచ్చిన ప్లేయర్లలో కేదార్ జాదవ్ ఒకడు. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన కేదార్ జాదవ్, 8 మ్యాచుల్లో 62 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం. రూ.7 కోట్ల 80 లక్షలు పెట్టిన జాదవ్ని సీఎస్కే వదులుకోగా... ఐపీఎల్ 2021 వేలంలో అతని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లుగా ఉంది. జాదవ్ని రెండు కోట్లు పెట్టి కొనడానికి ఏ జట్టూ సాహసించకపోవచ్చు. కొంటే మళ్లీ చెన్నైలోకే జాదవ్ వెళ్లే అవకాశం ఉంది.
పియూష్ చావ్లా: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సీనియర్ సభ్యుడిగా ఉన్న పియూష్ చావ్లా, గత సీజన్లో రూ.6 కోట్ల 75 లక్షల భారీ పారితోషికం అందుకున్నాడు. అయితే ఏడు మ్యాచులు ఆడి, ఆరు వికెట్లు మాత్రమే తీసిన చావ్లాని, వేలానికి వదిలేసింది చెన్నై. ఈ సీనియర్ స్పిన్నర్ని కొనడానికి ఏ జట్టూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం లేదు.
గ్లెన్ మ్యాక్స్వెల్: ఐపీఎల్ 2020 సీజన్లో అత్యంత పేలవమైన ప్రదర్శన ఇచ్చిన ప్లేయర్లలో గ్లెన్ మ్యాక్స్వెల్ ఒకడు. ఎంతో ఆశపడి రూ.10 కోట్ల 75 లక్షలకు మ్యాక్స్వెల్ని కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతీ జింటా. అయితే మ్యాక్స్వెల్ 13 మ్యాచులు ఆడి 108 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం మ్యాక్స్వెల్ దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శనకి నిదర్శనం...
మురళీ విజయ్: సీనియర్ ప్లేయర్లకు నిలయమైన చెన్నై సూపర్ కింగ్స్లో ఓపెనర్గా ఇన్నాళ్ల పాటు కొనసాగాడు మురళీ విజయ్. ధనాధన్ బ్యాటింగ్తో విరుచుకుపడగల మురళీ విజయ్, గత సీజన్లో కేవలం 3 మ్యాచులు మాత్రమే ఆడి 32 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్లో రెండు సెంచరీలతో పాటు 2 వేలకు పైగా పరుగులు సాధించిన మురళీ విజయ్ని ఏ జట్టు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుందనేది అనుమానంగా మారింది.
హర్భజన్ సింగ్: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్... వ్యక్తిగత కారణాలతో 2020 ఐపీఎల్ సీజన్లో పాల్గొనలేకపోయాడు. ఐపీఎల్లో 150 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్ వయసు ఇప్పుడు 40 ఏళ్లు దాటింది. అయితే మ్యాచ్ విన్నర్గా గుర్తింపు పొందిన భజ్జీకి ఐపీఎల్ 2021 సీజన్ ఆడే అవకాశం దక్కొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అతని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లుగా ఉంది. హర్భజన్ కోసం అంత ధర చెల్లించేందుకు ఏ ఫ్రాంఛైజీ ఇష్టపడుతుందో చూడాలి.
ఉమేశ్ యాదవ్: ఐపీఎల్ కెరీర్లో 121 మ్యాచులు ఆడి, 119 వికెట్లు పడగొట్టాడు ఉమేశ్ యాదవ్. అయితే గత సీజన్లో కేవలం 2 మ్యాచులు మాత్రమే ఆడిన ఉమేశ్ యాదవ్, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో రూ.4 కోట్ల 20 లక్షలకు కొన్న ఉమేశ్ యాదవ్ని మినీ వేలానికి విడుదల చేసింది ఆర్సీబీ. 2021 మినీ వేలంలో ఉమేశ్ యాదవ్ బేస్ ప్రైజ్ రూ.1 కోటి రూపాయలు. ఉమేశ్ యాదవ్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపంచే జట్ల సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు.