2021 IPL మెగా వేలం... నిబంధనలు ఇవే, వేలానికి ముందే ముస్తాక్ ఆలీ ట్రోఫీ...
IPL 2020 సీజన్ను విజయవంతంగా ముగించిన బీసీసీఐ, వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. 2021 ఐపీఎల్ సీజన్ కోసం మెగా వేలం వచ్చే జనవరిలో జరగబోతోంది. ఈ మెగా వేలం నిబంధనలు ఇవే..
ఐపీఎల్ ముగిసిన తర్వాత యంగ్ క్రికెటర్లలోని టాలెంట్ను చూపించేందుకు వీలుగా రంజీ ట్రోఫీ కంటే ముందు సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ జరగనుంది...
వచ్చే ఏడాది జనవరిలో ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది... సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో మెరిసే యంగ్ క్రికెటర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీపడబోతున్నాయి...
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కత్తా నైట్రైడర్స్ వంటి జట్లు సత్తా చాటే యువ క్రికెటర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి...
చెన్నై సూపర్ కింగ్స్లో చాలామంది యంగ్ క్రికెటర్లు ఉన్నా, వారికి పెద్దగా అవకాశం రాలేదు. సీజన్ ఆఖర్లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు..
‘అవును... ఈ సీజన్లో రెండు మూడు జట్లు వీక్గా కనిపించాయి. వాటికి యంగ్ టాలెంట్ అవసరం. అందుకు ఐపీఎల్ వేలం చాలా అవసరం. కుర్రాళ్ల టాలెంట్ బయటికి తేవాలంటే రంజీ ట్రోఫీకి ముందు సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ నిర్వహించడం చాలా అవసరం...’ అంటూ చెప్పుకొచ్చాడో బీసీసీఐ అధికారి.
10 రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లతో కలిసి మూడు క్రికెట్ స్టేడియాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆటగాళ్ల బస కోసం ఫైవ్ స్టార్లు ఏర్పాటు చేసి, కరోనా నిబంధనలకు లోబడి ఈ మెగా టీ20 టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది బీసీసీఐ.
మెగా వేలం 2021లో ఏ జట్టు కూడా ఐదుగురికి మించి ప్లేయర్లను తమ వద్ద ఉంచుకోవడానికి వీలులేదు. వీరిలో ఇద్దరు విదేశీ ప్లేయర్లు, ముగ్గురు స్వదేశీ ప్లేయర్లు ఉంటారు...
మెగా వేలం జరుగుతున్నప్పుడు తమ పాత ప్లేయర్ను మళ్లీ కొనుక్కోవాలనుకుంటే, వేలంలో సదరు క్రికెటర్కి వచ్చిన ధరకు తిరిగి తీసుకునే హక్కు మాత్రం ఫ్రాంఛైజీకి ఉంటుంది...
సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ కేన్ విలియంసన్ వేలంలో సుమారు రూ.10 కోట్లకు వేరే జట్లు కొనుగోలు చేసిందనుకోండి. సన్రైజర్స్ అతన్ని వదుకోవడం ఇష్టం లేకపోతే, ఆ మొత్తం చెల్లిస్తామని రిటైన్ కార్డు చూపించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం 2021 జనవరిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. 2021లో అదనంగా ఒకటి లేదా రెండు జట్లను చేర్చాలనే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయనే విషయం తెలిసిందే.