ఇలా అయితే కష్టమే... మహా నీరసంగా సాగుతున్న ఐపీఎల్ 2021 మ్యాచులు...
క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ సమరం ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సాగే పరుగుల వరద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 14వ సీజన్ ఐపీఎల్ మ్యాచులు మాత్రం అలాంటి మజాను అందించడం లేదు. నిద్రపోగొట్టే సిక్సర్ల బీభత్సం, నరాలు తెగే ఉత్కంఠతో నిండే ఐపీఎల్ మ్యాచులు... చప్పగా సాగుతూ క్రికెట్ ఫ్యాన్స్ని కూడా కునుకులు తీసేలా చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న సమయంలో ఐపీఎల్ 2020 సీజన్, క్రికెట్ ఫ్యాన్స్ను ఊర్రూతలూగించింది. ప్రతీ మ్యాచ్ ఉత్కంఠగా సాగడం, ఏకంగా ఐదు సూపర్ ఓవర్ మ్యాచులు, ఓ డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్... గత సీజన్ ఇచ్చిన మజాయే వేరు...
అలాంటి ఎంటర్టైన్మెంట్ చూసిన అభిమానులకు ఐదు నెలల గ్యాప్లోనే మరోసారి పలకరించింది ఐపీఎల్. అయితే స్వదేశంలో నిర్వహిస్తున్న ఈ సీజన్ మాత్రం గత సీజన్ ఇచ్చిన మజాలో సగం కూడా ఇవ్వలేకపోతోంది...
భారీ హిట్టర్లు ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు కూడా స్లో బ్యాటింగ్తో, జిడ్డు బ్యాటింగ్తో క్రికెట్ ఫ్యాన్స్ను నిరాశపరుస్తుందంటే... ఐపీఎల్ 2021 సీజన్ ఎలా సాగుతుందో చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ...
ఐపీఎల్ 2021 సీజన్లో కోల్కత్తా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రమే అలాంటి మజాను అందించగలిగింది. ఓవర్ ఓవర్కి ఉత్కంఠ రేపుతూ, మ్యాచ్ రిజల్ట్ ఏమవుతుందా అని అభిమానులు ఆఖరి ఓవర్ దాకా వేచి చూసేలా చేసింది...
ఆ తర్వాత ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్తో పాటు బౌండరీల మోత మోగే వాంఖడే స్టేడియంలో రాజస్థాన్, కోల్కత్తా మధ్య జరిగిన మ్యాచ్ కూడా చప్పగా సాగి... క్రికెట్ ఫ్యాన్స్కి కోరుకున్న మజాని అందించలేకపోయాయి...
2020 సీజన్ జరిగిన యూఏఈ పిచ్లు భారతదేశ పిచ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. అక్కడ పరుగుల వరద పారించడం చాలా సులువు. బౌండరీ విస్తీర్ణం కూడా తక్కువ.
అందుకే యూఈఏలో జరిగిన టీ20 లీగ్, క్రికెట్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగింది. కానీ స్వదేశంలో జరుగుతున్న మెగా లీగ్లో స్టేడియం పెద్దది కావడం, పిచ్లు క్లిష్టమైనవి కావడం క్రికెటర్లను ఇబ్బంది పెడుతోంది.
వాస్తవానికి 2019 వరకూ స్వదేశంలోనే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయినా ఇదే పిచ్లపై పరుగులు వరద కురిసింది. కారణంగా స్టేడియం పూర్తిగా ప్రేక్షకులతో నిండి ఉండడం. చుట్టూ జనం కేరింతల మధ్య ఆడుతూ ఉంటే, ఎలాంటి ప్లేయర్ అయినా ఒత్తిడికి గురై, మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ఉత్సాహం పొందుతాడు.
సొంత మైదానంలో సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్ జరుగుతుంటే... ఆ జోరుతో సిక్సర్ల మోత మోగిస్తుంటారు ప్లేయర్లు. ఈసారి కరోనా నియమాల కారణంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు సాగుతుండడం, బయోబబుల్లో గడిపిన ప్లేయర్లలో మునుపటి జోష్ లేకపోవడం స్పస్టంగా కనిపిస్తోంది.
అయితే ఐపీఎల్ 2021 సీజన్ ఇంకా ఆరంభదశలోనే ఉంది. పాయింట్ల పట్టికలో ఓ క్లారిటీ వచ్చి, మున్ముందు ప్లేఆఫ్ చేరేందుకు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఆశిస్తున్నారు క్రికెట్ అభిమానులు...
స్లో బ్యాటింగ్ పిచ్, లో స్కోరింగ్ గేమ్లకు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైలో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఏప్రిల్ 25న జరిగే మ్యాచ్ ఆఖరి మ్యాచ్ కానుంది. ఆ తర్వాత ఢిల్లీ, అహ్మదాబాద్ వేదికలుగా మ్యాచులు జరుగుతాయి.
వేదిక మారిన తర్వాతైనా క్రికెట్ ఫ్యాన్స్ కోరుకునే ఉత్సాహం, జోరు ఐపీఎల్ ద్వారా దక్కుతుందో లేదో చూడాలి. ఇలాగే సాగితే మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత బోరింగ్ సీజన్గా మిగిలిపోతుంది 2021 సీజన్...