ఎమ్మెస్ ధోనీ వారసుడొచ్చాడ్రోయ్... దేవ్దత్ పడిక్కల్ ఇన్నింగ్స్పై బీభత్సమైన ట్రోలింగ్...
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఏ మాత్రం ఫామ్లో లేదు. అప్పుడెప్పుడో పంజాబ్ కింగ్స్పై, ఆ తర్వాత రాజస్థాన్పై ఓదార్పు విజయాలు దక్కించుకుంది సన్రైజర్స్... అలాంటి టీమ్పై 142 పరుగుల టార్గెట్ను ఛేదించలేక 4 పరుగుల తేడాతో ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ఐపీఎల్ 2021 సీజన్లో ప్లేఆఫ్స్కి అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి... టాప్ 2 ప్లేస్ను కొట్టేయాలని భావించింది...
వరుసగా మూడు మ్యాచుల్లో గెలవడం ఆర్సీబీకి చాలా కష్టం కాబట్టి టాప్ 2లో లీగ్ మ్యాచ్లను ముగిస్తే... మొదటి క్వాలిఫైయర్లో ఓడినా మరో ఛాన్స్ ఉంటుందని భావించింది...
అయితే వారి ఆశలపై నీళ్లు చల్లారు సన్రైజర్స్ హైదరాబాద్... కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి ఓవర్లోనే అవుట్ కాగా, వన్డౌన్లో వచ్చిన డానియల్ క్రిస్టియన్, ఆ తర్వాత వచ్చిన శ్రీకర్ భరత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు...
దేవ్దత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్వెల్ కలిసి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే కీలక దశలో వరుస వికెట్లు కోల్పోయి, ఓటమి పాలైంది ఆర్సీబీ...
లేని పరుగుకి కాల్ చేసి 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్వెల్ రనౌట్కి కారణమైన యంగ్ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్... టెస్టు ఇన్నింగ్స్తో ఆర్సీబీకి పరోక్షంగా కారణమయ్యాడు...
52 బంతులు ఆడి 4 ఫోర్లతో 41 పరుగులు చేసిన దేవ్దత్ పడిక్కల్, కీలక సమయంలో అవుట్ అయి జట్టును కష్టాల్లో పడేశాడు...
దేవ్దత్ పడిక్కల్ బంతులు ఎక్కువగా తినేయడం వల్ల, ఆఖరి ఓవర్లో ఏబీ డివిల్లియర్స్ వంటి స్టార్ ప్లేయర్ ఉన్నా విజయాన్ని అందుకోలేకపోయింది ఆర్సీబీ..
గత సీజన్లో ఆర్సీబీ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచిన దేవ్దత్ పడిక్కల్, ఫస్టాఫ్లో మంచి ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు...
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి, ఐపీఎల్లో సెంచరీ కూడా బాదిన పడిక్కల్, ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం ఆర్సీబీ ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురి చేసింది...
టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్ ఆడిన పడిక్కల్ను ఎమ్మెస్ ధోనీ వారసుడిగా పోలుస్తూ, తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...
మ్యాచ్ ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ ధోనీ, ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 27 బంతులాడి 18 పరుగులు చేసిన విషయం తెలిసిందే...
సుడిగాలి ఇన్నింగ్స్లతో క్రేజ్ తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్లో ఇలాంటి టెస్టు ఇన్నింగ్స్లు కోకొల్లలు...
అదీకాక మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు, దేవ్దత్ పడిక్కల్ పుట్టినరోజు ఒకటే. జూలై 7, 1981న ఎమ్మెస్ ధోనీ జన్మించగా, జూలై 7, 2000న పడిక్కల్ పుట్టాడు... దాంతో ధోనీ సరైన టెస్టు వారసుడు వచ్చేశాడంటూ పడిక్కల్ను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు...