నలుగురు కాదు, ఐదుగురు కావాలి... రూల్ మార్చాలంటున్న ఫ్రాంఛైజీలు... బీసీసీఐ ఒప్పుకుంటుందా?!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ అంచె కనివినీ ఎరుగని రీతిలో సూపర్ సక్సెస్ సాధించింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఐపీఎల్కి బీభత్సమైన టీఆర్పీ రేటింగ్లు వచ్చాయి. జనాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లో జరిగినా వ్యూయర్ షిప్ రికార్డు స్థాయిలో పెరగడంతో నిర్వాహకులకు మంచి లాభాలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వచ్చే సీజన్లో ఒకటి లేదా రెండు అదనపు జట్లను తేవాలని బీసీసీఐ ప్రయత్నిస్తుండగా... ఫ్రాంఛైజీలు కొత్త డిమాండ్లను వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే ప్రారంభం కాబోతోంది ఐపీఎల్ 2021 సీజన్... 14వ సీజన్కి సంబంధించిన వేలం మరో రెండు నెలల్లో జరగబోతున్నట్టు సమాచారం.
మరో నాలుగు నెలల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021లో చాలా రకాల మార్పులు తేవాలని చూస్తోంది భారత క్రికెట్ నియంత్రణ సంస్థ...
కరోనా నష్టం నుంచి కోలుకునేందుకు అదనంగా ఒకటి లేదా రెండు జట్లను పరిచయం చేయాలని చూస్తోంది బీసీసీఐ...
అదనంగా జట్లు వస్తుండడంతో తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే ఉండాలనే నిబంధనను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి కొన్ని ఫ్రాంఛైజీలు.
నలుగురు ఫారిన్ ప్లేయర్లకి బదులుగా ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
అయితే ఈ నిబంధన సవరించడానికి బీసీసీఐ ఒప్పుకుంటుందా? అనేది అనుమానంగా మారింది. కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్... ప్రారంభం కావడానికి అసలు కారణం భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యంగ్ స్వదేశీ క్రికెటర్ల సామర్థ్యం ప్రపంచానికి పరిచయం చేయాలనే!
2008 నుంచి ఇప్పటిదాకా బుమ్రా, హార్ధిక్ పాండ్యా,శిఖర్ ధావన్ చాలామంది క్రికెటర్లు ఐపీఎల్లో సత్తా చాటి, భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు...
అయితే స్వదేశీ ప్లేయర్లతో పోలిస్తే పెద్దగా రాణించకపోయినా విదేశీ క్రికెటర్లను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి ఫ్రాంఛైజీలు...
ఐపీఎల్లో వరుసగా ఫెయిల్ అవుతున్న మ్యాక్స్వెల్ వంటి ప్లేయర్లకు కోట్లు కుమ్మరిస్తున్న ఫ్రాంఛైజీలు యంగ్ ప్లేయర్ల కోసం బేస్ ప్రైజ్ చెల్లించడానికి కూడా ఇష్టపడడం లేదు...
ఇప్పుడు ఈ నిబంధన మారిస్తే... ఐపీఎల్ ప్రాథమిక లక్ష్యం కనుమరుగవుతుంది. యంగ్ టాలెంట్కి వేదిక కావాల్సిన ఐపీఎల్... కేవలం కాసులు కురిపించే కమర్షియల్ ఆటగా మిగిలిపోతుంది.