IPL 2020: ఈ సీజన్లో గేమ్ ఛేంజర్లు వీళ్లే...
మ్యాచ్ ఫలితం మారిపోవడానికి ఒక్క ఓవర్ చాలు. కొన్నిసార్లు ఒక్క బంతితోనే ఫలితం తారుమారు కావచ్చు. అలాగే ఒక్కే ప్లేయర్ కారణంగా మ్యాచ్ రూపమే మారిపోతుంది. ఇలా ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పే ప్లేయర్లను ‘గేమ్ ఛేంజర్స్’ అంటారు. అలాంటి గేమ్ ఛేంజర్స్ ఈసారి ఏఏ జట్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..
రషిద్ ఖాన్: ఈ యంగ్ ఆల్రౌండర్ ఎలాంటి స్టార్ బ్యాట్స్మెన్నైనా తన స్పిన్ మాయాజాలంతో పడగొట్టేయగలడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ఆడుతున్న రషిద్, లీగ్లో ఇప్పటిదాకా 55 వికెట్లు తీశాడు. బ్యాట్స్మెన్ హవా నడిచే ఐపీఎల్లో రషిద్ ఖాన్ సగటు 6.55గా ఉండడం కూడా మనోడి ప్రతిభకు బెస్ట్ ఉదాహరణ.
ఆండ్రూ రస్సెల్: గత సీజన్లో ఆండ్రూ రస్సెల్ చేసిన సునామీ ఇన్సింగ్స్లు క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా మరిచిపోలేదు. 200+ స్టైక్ రేటుతో బ్యాటింగ్ చేసే రస్సెల్ క్రీజులో ఉంటే, బౌలర్లకు, ఫీల్డర్లకు చుక్కలు కనిపిస్తాయి. కోల్కత్తా నైట్ రైడర్స్ ఆశలన్నీ ఆండ్రూ రస్సెల్పైనే.
హార్ధిక్ పాండ్యా: గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ ద్వారా మళ్లీ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నాడు. బ్యాటుతో భారీ సిక్సులు బాదే పాండ్యా, బౌలింగ్తోనూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు.
షేన్ వాట్సన్: ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆసీస్ స్టార్ క్రికెటర్ షేన్ వాట్సన్. కొన్నాళ్లుగా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన వాట్సన్, గత సీజన్లో ఆకట్టుకున్నాడు. కాలికి గాయమై, రక్తం కారుతున్నా బ్యాటింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. రైనా లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్కి వాట్సన్ గేమ్ ఛేంజర్ కానున్నాడు. అసలు సిసలైన గేమ్ ఛేంజర్గా ధోనీ కూడా వాట్సన్కు తోడుగా ఉన్నాడు.
రిషబ్ పంత్: ఐపీఎల్లో ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. గత సీజన్లో పటిష్ట ముంబైపై 27 బంతుల్లో 78 పరుగులు చేశాడు రిషబ్ పంత్. జట్టుకు అవసరమైనప్పుడు ఇలాంటి సుడిగాలి ఇన్సింగ్స్లతో ఆకట్టుకున్న రిషబ్ పంత్, ఢిల్లీకి ప్రధాన బలం కానున్నాడు.
గ్లెన్ మ్యాక్స్వెల్: మ్యాక్స్వెల్ ఫామ్లో ఉంటే అతన్ని అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు. అందుకే రూ.10 కోట్లు వెచ్చించి మరీ మ్యాక్స్వెల్ను సొంతం చేసుకుంది పంజాబ్ జట్టు. రాహుల్, గేల్కి తోడుగా మ్యాక్స్వెల్ చెలరేగిపోతే పంజాబ్ టైటిల్ ఆశలు తీరినట్టే.
బెన్ స్టోక్స్: చేజారిన మ్యాచ్ను కూడా ఒంటిచేత్తో గెలిపించగల ఆల్రౌండర్ బెన్ స్టోక్స్. రాజస్థాన్ రాయల్స్ స్టోక్స్పై భారీ అంచనాలే పెట్టుకుంది. గత సీజన్లో ఫెయిల్ అయినా, ఈసారి స్మిత్ నాయకత్వంలో బెన్ స్టోక్స్ అదరగొడతాడని ఆర్ఆర్ భావిస్తోంది. ఈ ఏడాది ఎంట్రీ ఇవ్వబోతున్న భారత యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ కూడా రాజస్థాన్కి గేమ్ ఛేంజర్ కాబోతున్నాడు.
ఏబీ డివిల్లియర్స్: ఈసారి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టులో చెప్పుకోదగ్గ గేమ్ ఛేంజర్లు ఎవ్వరూ లేరు. ఆర్సీబీ బ్యాటింగ్ బలమంతా కోహ్లీ, డివిల్లియర్స్ మోయనున్నారు. గత సీజన్లో కూడా ఏబీడీ తన పోరాట ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఈసారి ఆసీస్ ప్లేయర్ ఆరోన్ ఫించ్పై ఆర్సీబీ ఎన్నో ఆశలు పెట్టుకున్నా, అతను ఏ రేంజులో ఆకట్టుకుంటాడో చూడాలి.