ఫిట్గా ఉన్నానంటున్న రోహిత్ శర్మ... సెలక్టర్లు ఇప్పుడేం చెబుతారు?
IPL 2020 సీజన్లో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్లో గాయపడ్డాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ మ్యాచ్ జరిగి 20 రోజులు అయిపోయింది. ఆ తర్వాత ముంబై మూడు మ్యాచులు కూడా ఆడింది. అయితే రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే గ్రూప్ స్టేజ్లో జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో బరిలో దిగుతున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్కి గురి చేశాడు రోహిత్ శర్మ.
ఆఖరి గ్రూప్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో టాస్కి వచ్చిన రోహిత్ శర్మ... తాను ఫిట్గా ఉన్నానంటూ ప్రకటించాడు...
రోహిత్ శర్మ ఫిట్గా ఉన్నాడంటూ, త్వరలో బరిలో దిగుతాడంటూ ప్రకటిస్తూ వచ్చింది ముంబై ఇండియన్స్.... ఆస్ట్రేలియా టూర్కి భారత జట్టును ప్రకటించిన తర్వాతి రోజే రోహిత్ శర్మ నెట్లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.
దీంతో ఫిట్గా కనిపిస్తున్నా రోహిత్ శర్మను ఆసీస్ టూర్కి ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు నెటిజన్లు. దీనిపై స్పందించిన బీసీసీఐ... రోహిత్ శర్మ గాయం తగ్గలేదని, అతను ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఫేక్ అని, పాత వీడియోలని చెప్పింది.
రోహిత్ శర్మ ఫిట్నెస్ను బీసీసీఐ మెడికల్ సిబ్బంది స్వయంగా పర్యవేక్షించి, ఆసీస్ టూర్కి అందుబాటులో ఉండేది, లేనిదీ చెబుతుందని తెలిపింది బీసీసీఐ...
అయితే ఇది జరిగిన రెండు రోజులకే తాను ఫిట్గా ఉన్నానంటూ ప్రకటించిన రోహిత్ శర్మ, ఏకంగా మ్యాచ్లో బరిలో దిగబోతున్నాడు. దీంతో మళ్లీ బీసీసీఐ ఏం దాస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు.
తొడ కండరాలు పట్టేయడంతో గాయపడిన రోహిత్ శర్మ కోలుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని ప్రకటించారు వైద్యులు. అక్టోబర్ 18న జరిగిన మ్యాచ్లో గాయపడిన రోహిత్, నవంబర్ 3న జరుగుతున్న మ్యాచ్ నాటికి కోలుకుని బరిలో దిగుతున్నాడు.
మరి నవంబర్ 27న మొదలయ్యే ఆసీస్ టూర్కి రోహిత్ శర్మను ఎంపిక చేయడానికి సెలక్టర్లకు ఏం ఇబ్బంది కలిగింది... టీ20 సిరీస్కి కాకపోయినా వన్డే, టెస్టు సిరీస్కి రోహిత్ శర్మను ఎంపిక చేయొచ్చు.
కానీ మూడు ఫార్మాట్లకి రోహిత్ శర్మను పక్కనబెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే ఆసీస్ టూర్కి వెళతాడని స్వయంగా ప్రకటించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. మరి నేటి మ్యాచ్లో రోహిత్ శర్మ ఫిట్నెస్ను బట్టి అతను ఆసీస్ టూర్కి వెళ్లేది, లేదని నిర్ణయించబడుతుంది.
పటిష్ట ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఓడించాలన్నా, కనీస పోరాటం చూపించాలన్నా జట్టులో రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ ఉండడం అత్యంత ఆవశ్యకం...