IPL 2020: అంబానీ టీమ్ కావడం వల్లే ముంబై ఇండియన్స్కి ఇన్ని విజయాలా...
IPL 2020 మెగా క్రికెట్ సమరం ముగిసింది. 2020 ఏడాది ఐపీఎల్లో ఏదైనా కొత్త జట్టును ఛాంపియన్గా చేస్తుందేమోనని ఆశపడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వరుసగా రెండో సారి టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఐపీఎల్లో ఐదో టైటిల్ సొంతం చేసుకుని చరిత్ర క్రియేట్ చేసింది. అయితే భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సొంత జట్టు కావడం వల్లే ముంబై ఇండియన్స్ వరుసగా టైటిల్స్ గెలుస్తోందని అంటున్నారు కొందరు అభిమానులు.
2020 సీజన్లో జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. ముంబై ఇండియన్స్. ఆడిన 16 మ్యాచుల్లో కలిపి మొత్తంగా 15 మంది ప్లేయర్లను మాత్రమే వాడింది...
ఇంత తక్కువ మంది ప్లేయర్లను వాడి, టైటిల్ గెలవడం అంటే అంత తేలికైన పని కాదు... అది కూడా ఏకంగా ముగ్గురు విదేశీ క్రికెటర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు ముంబై ఇండియన్స్.
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ క్రిస్లీన్ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అతనితో పాటు విండీస్ ఆల్రౌండర్ రూథర్ఫర్ట్, న్యూజిలాండ్ పేసర్ మిచెల్ మెక్కెలగన్ వంటి ప్లేయర్లకు ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం దక్కలేదు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అంత పటిష్టమైన జట్టు మరేదీ లేదు. బ్యాటింగ్లో యంగ్ గన్స్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రాణిస్తున్న విధానం చూస్తుంటేనే ముంబై ఇండియన్స్ జట్టులో వాతావరణం ఎలా ఉందో అర్థం అవుతోంది.
హర్ధిక్ పాండ్యా, పోలార్డ్, రోహిత్ శర్మ, కృనాల్ పాండ్యా వంటి ఆల్రౌండర్లతో పాటు డి కాక్ కూడా అద్భుతంగా రాణించాడు. బౌలింగ్లో బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ కలిసి 50కి పైగా వికెట్లు పడగొట్టారు.
ఈ రేంజ్లో ఏ జట్టు అయినా అదరగొడుతుంటే ఇంకా ఆ జట్టుకి తిరుగేం ఉంటుంది. ఏ జట్టులో అయినా రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ ఆరంభంలో డకౌట్ అయినా ఆ ఎఫెక్ట్ జట్టుపై పడుతుంది. మిగిలిన బాట్స్మెన్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ, రన్రేటును తగ్గిస్తారు.
అయితే ముంబై విషయంలో ఇలా జరగదు. రోహిత్ శర్మ డకౌట్ అయిన మ్యాచులో ఏకంగా 200 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై ఇండియన్స్. ఇదే ముంబైని ఛాంపియన్ టీమ్గా నిలబెట్టింది.
నిజానికి 2016, 17 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ జట్టులో స్టార్లకు తిరుగులేదు. డి కాక్, షేన్ వాట్సన్, క్రిస్ గేల్, కెఎల్ రాహుల్, కోహ్లీ, ఏబీడీ వంటి స్టార్లు అందరూ బెంగళూరులోనే ఉన్నారు. అయినా ఆర్సీబీ గెలవలేకపోయింది.
కారణం చాలా సింపుల్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్లను భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ముంబై యంగ్ క్రికెటర్లను కొనుగోలు చేసి, స్టార్ క్రికెటర్లుగా మార్చింది...
ఇప్పుడు ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ నుంచి హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బుమ్రా వంటి వాళ్లంతా ముంబై టీమ్లోకి వచ్చిన తర్వాత భారత క్రికెట్లో స్టార్లుగా ఎదిగినవాళ్లే...
క్రిస్లీన్ వంటి స్టార్ను కొనుగోలు చేసి, ప్రత్యర్థి జట్టుకి ఆడకుండా చేయగల వ్యూహం ముంబై ఇండియన్స్ మాత్రమే చేయగలదు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ చేరకపోవడం వల్ల ముంబై పరిస్థితి మరీ ఈజీ అయిపోయింది.
ముంబై తర్వాత ఆ రేంజ్లో అదరగొడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్, ఫైనల్ దాకా చేరుకోలేకపోయింది. ముంబైకి రిస్క్ అనుకున్న కోల్కత్తాను రానీయ్యకుండా స్ట్రాటెజీ అమలు చేయడం కూడా యుద్ధవ్యూహమే.
ఇన్ని రకాలుగా పక్కా ప్రణాళికతో సాగుతూ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది ముంబై ఇండియన్స్. ముంబై విజయాల వెనక అంబానీయే ఉంటే, ఇప్పటికి పరిస్థితి ఇంకాస్త మెరుగ్గా ఉండేది.
మొదటి ఐదు సీజన్లలో అదీ కూడా సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్ నాయకత్వంలో ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత ముంబైకి విజయాలు, టైటిల్స్ రావడం మొదలైంది.
అయితే ముకేశ్ అంబానీ యజమాని కావడం వల్ల ముంబై ఇండియన్స్కి చాలా విషయాల్లో కలిసి వచ్చిందనే చెప్పాలి. ఐపీఎల్లో అత్యంత ఖరీదైన జట్టు ముంబై ఇండియన్స్ ఖరీదు..దాదాపు 780 కోట్ల రూపాయలు.
రెండో స్థానంలో ఉన్న కోల్కత్తా నైట్రైడర్స్ విలువ రూ.718 కోట్ల రూపాయలు. అయినా వారికి పెద్దగా కలిసి రాలేదు. కారణం తెలిసిందే. జట్టును నడిపించే విషయంలో షారుక్, నీతూ అంబానీ మధ్య ఉన్న వ్యత్యాసమే.
షారుక్ యజమానినంటూ ఓ రకమైన దర్పం చూపిస్తే, వేల కోట్ల అధినేత్రి నీతూ అంబానీ ముంబై ప్లేయర్లతో నవ్వుతూ కలిసిపోతుంది. వేలం విషయంలో తప్ప మరే విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోదు...
ఏ రంగంలోనైనా రాణించడం, విజయం సాధించడం అంబానీ కుటుంబానికి బాగా తెలుసు. అదీ ఆటైనా, ఆయిల్ కంపెనీ అయినా. అందుకే మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లను పట్టుకుని, ఐదు టైటిల్స్ గెలుచుకుంది.