INDvsSL 3rd ODI: టాస్ గెలిచిన భారత జట్టు... ఐదుగురు కొత్త కుర్రాళ్లకు ఛాన్స్...
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు వన్డేల్లో టాస్ ఓడిన శిఖర్ ధావన్, టాస్ గెలిచిన అనంతరం తొడ కొట్టి, తన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇప్పటికే మొదటి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా సిరీస్ను సొంతం చేసుకోవడం, మూడో వన్డేలో ఏకంగా ఆరు మార్పులతో బరిలో దిగుతోంది.
రెండో వన్డేలో మూడు వికెట్లు తీసి భారత జట్టును ఇబ్బంది పెట్టిన లంక బౌలర్ వానిడు హసిరంగ గాయం కారణంగా నేటి మ్యాచ్లో బరిలో దిగడం లేదు.
భారత జట్టు తరుపున సంజూ శాంసన్, నితీశ్ రాణా, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహార్... నేటి మ్యాచ్ ద్వారా వన్డే ఆరంగ్రేటం చేస్తున్నారు...
వీరిలో ఇప్పటికే సంజూ శాంసన్, రాహుల్ చాహార్ ఇప్పటికే టీమిండియా తరుపున టీ20ల్లో ఎంట్రీ ఇచ్చినా, ఇప్పటిదాకా వన్డే ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు...
మొదటి వన్డేలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఆరంగ్రేటం చేయడంతో ఈ వన్డే సిరీస్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త కుర్రాళ్ల సంఖ్య ఏడుకి చేరింది..
పృథ్వీషా స్థానంలో మంచి ఫామ్లో ఉన్న దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్లకు అవకాశం దక్కుతుందని భావించినా, వారికి నిరాశే ఎదురైంది...
బౌలింగ్లో సమూలమైన మార్పులు చేసిన టీమిండియా... తొలి రెండు వన్డేల్లో ఆడిన బౌలర్లు కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్లకు రెస్ట్ ఇచ్చింది. వీరితో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్కి అవకాశం ఇచ్చింది.
శ్రీలంక జట్టు: దసున్ శనక, మినోద్ భనుక, అవిష్క ఫెర్నాండో, రాజపక్ష, ధనుంజయ డి సిల్వ, చరిత్ అసలంక, ప్రవీణ్ జయవిక్రమ, అకిల ధనంజయ, రమేశ్ మెండీస్, దుస్మంత చమీర, చమిత్ కరుణరత్నే
భారత జట్టు: శిఖర్ ధావన్, పృథ్వీషా, సంజూ శాంసన్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, నితీశ్ రాణా, కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహార్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా.