స్పిన్నర్లను అరువు తెప్పించుకుని మరీ ప్రాక్టీస్ చేశారు.. కంగారూలూ.. ఇదేనా మీ ఆట..?
INDvsAUS 1st Test: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ టెస్టుకు ముందే ఆసీస్.. బరోడా టీమ్ కు చెందిన స్పిన్నర్ మహీశ్ పతియాను బెంగళూరుకు రప్పించుకుని అతడితో ప్రాక్టీస్ చేయించింది. అంతేగాక బెంగళూరుకు సమీపంలో ఓ పిచ్ ను పూర్తి స్పిన్ పిచ్ గా తయారుచేయించి మరీ ప్రాక్టీస్ చేసింది.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత స్పిన్ త్రయం అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాల స్పిన్ ఉచ్చులో పడి ఆసీస్ దారుణంగా దెబ్బతింది. అయితే ఈ మ్యాచ్ కు ముందు పది రోజులు ముందే బెంగళూరుకు చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు భారత స్పిన్ పిచ్ లపై రాణించేందుకు ఇక్కడి స్పిన్నర్లను అరువు తెచ్చుకుంది.
బరోడా టీమ్ కు చెందిన స్పిన్నర్ మహీశ్ పతియాను బెంగళూరుకు రప్పించుకుని అతడితో ప్రాక్టీస్ చేయించింది. అంతేగాక బెంగళూరుకు సమీపంలో ఓ పిచ్ ను పూర్తి స్పిన్ పిచ్ గా తయారుచేయించి మరీ ప్రాక్టీస్ చేసింది. ప్రధానంగా స్పిన్ ను బాగా ఆడే పేరున్న స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ లు ప్రాక్టీస్ చేశారు.
ప్రాక్టీస్ సందర్భంగా తాము స్పిన్ ను ధీటుగా ఎదుర్కంటున్నామని, నాగ్పూర్ పిచ్ తో పాటు రాబోయే టెస్టులలో కూడా భారత స్పిన్నర్లకు తిప్పలు తప్పవని హెచ్చరించారు. మైండ్ గేమ్ లో భాగంగా భారత స్పిన్నర్లపై అవాకులు చెవాకులు పేలారు. ఈసారి అశ్విన్ ను తాము సమర్థవంతంగా ఎదుర్కుంటామని, అశ్విన్ తో పాటు అక్షర్ పటేల్ లు తమను ఔట్ చేయడానికి ఇబ్బందులు తప్పవని వాపోయారు. అయితే నాగ్పూర్ టెస్టులో మాత్రం అందుకు విరుద్దంగా జరిగింది.
తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 177 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు దక్కించుకోగా అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. స్పిన్ కు అనుకూలించే పిచ్ పై ఆసీస్ స్పిన్నర్లు కూడా ధీటుగానే రాణించారు. ఆసీస్ యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ.. ఏడు వికెట్లు తీశాడు.
రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ ప్రధాన బ్యాటర్లంతా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. స్పిన్ ను భాగా ఆడాతారని పేరున్న ఖవాజా, వార్నర్, లబూషేన్ లతో పాటు అంతగా అనుభవం లేదని రెన్షా, హ్యాండ్స్కాంబ్, అలెక్స్ క్యారీలు అలా వచ్చి ఇలా వెళ్లారు.
రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ వైఫల్యానికి అశ్విన్ పునాధులు వేయగా జడేజా, అక్షర్ లు పనిని పూర్తి చేశారు. అశ్విన్ ను ఎదుర్కోవడానికి అతడిలా బౌలింగ్ చేసే మహీశ్ తో బౌలింగ్ చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది.