ఆడాళ్లు... మీకు జోహార్లు! ఓడించిన జట్టు గడ్డ మీదే ఏడోసారి ఛాంపియన్గా నిలిచి...
వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీని భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్లో వన్డే సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి, బంగ్లాదేశ్లో అడుగుపెట్టిన భారత మహిళలు, ఆసియా కప్ టైటిల్తో స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చూపించిన మహిళా జట్టు... రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియా కప్ని కైవసం చేసుకుంది...

Image credit: Getty
మెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీకి డిఫెండింగ్ ఛాంపియన్గా ఆరంభించింది భారత జట్టు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా ద్వైపాక్షిక సిరీస్లు గెలుస్తూ వచ్చిన భారత జట్టు, మరోసారి ఆసియా కప్ టైటిల్ గెలవడం ఖాయమని అనుకున్నారంతా. అయితే అలా జరగలేదు...
Women Indian Cricket Team
సూపర్ 4 రౌండ్లో పాకిస్తాన్ చేతుల్లో ఓడిన రోహిత్ సేన, ఆ తర్వాత శ్రీలంక చేతుల్లో కూడా ఓడి ఫైనల్కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ పరాభవంతో భారత మహిళా జట్టుపై ఎక్కడో ఓ చిన్న భయం, అనుమానం... అయితే అద్భుత పర్ఫామెన్స్తోనే ఆ భయాలన్నింటినీ పటాపంచలు చేసింది టీమిండియా...
Indian Women Cricket team
2004లో వుమెన్స్ ఆసియా కప్ మొదలైనప్పటి నుంచి ప్రతీ ఎడిషన్లోనూ టైటిల్ నెగ్గుతూ వచ్చింది భారత మహిళా జట్టు. అయితే 2018 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడింది భారత మహిళా జట్టు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022 టైటిల్ని కైవసం చేసుకుని, మరోసారి ‘ఆసియా ఛాంపియన్’గా నిలిచింది...
సెప్టెంబర్ నెలలో భారత పురుషుల జట్టు, శ్రీలంక చేతుల్లో ఓడి ఆసియా కప్ 2022 ఫైనల్కి అర్హత సాధించలేకపోతే... అదే లంక మహిళా జట్టును ఫైనల్లో చిత్తు చేసింది భారత మహిళా జట్టు. అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్, బ్యాటింగ్... అన్ని విభాగాల్లోనూ టీమిండియా డామినేషన్ కనిపించింది...
ఫైనల్ మ్యాచ్లో 3 ఓవర్లలో ఓ మెయిడిన్తో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన రేణుకా సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిస్తే... బ్యాటుతో 132.39 స్ట్రైయిక్ రేటుతో 94 పరుగులు చేసి 3.33 ఎకానమీతో 13 వికెట్లు తీసిన దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకుంది...
Image credit: Getty
ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో రనౌట్ (మన్కడింగ్) ద్వారా ఇంగ్లాండ్ బ్యాటర్ని అవుట్ చేసి, క్రీడా స్ఫూర్తి లేదని తీవ్ర విమర్శలు ఎదుర్కొంది దీప్తి శర్మ... 15 రోజుల గ్యాప్లో తన ఆల్రౌండ్ పర్ఫామెన్స్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి... ఆ ట్రోల్స్కి విజయంతో పర్ఫెక్ట్ సమాధానం ఇచ్చింది దీప్తి...
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి రూ.7 కోట్లు తీసుకుంటూ, మ్యాచ్ ఫీజు, స్పాన్సర్లు, బ్రాండ్ ప్రమోషన్ల పేరులో కోట్లకు కోట్లు తీసుకుంటున్న మెన్స్ క్రికెట్ టీమ్ సాధించలేకపోయిన ఆసియా కప్ని... పురుషుల టీమ్ ద్వారా వచ్చే ఆదాయంతో కాలం గడుపుతున్నారని విమర్శలు ఎదుర్కొన్న మహిళా టీమ్ సాధించి చూపించింది. దీంతో ‘ఆడాళ్లు.. మీకు జోహార్లు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు...