INDvsSL 3rd ODI: భారత బ్యాట్స్మెన్ విఫలం... శ్రీలంక ముందు ఈజీ టార్గెట్...
సిరీస్లో తొలిసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శిఖర్ ధావన్కి శ్రీలంక బౌలర్లు అద్భుత పర్ఫామెన్స్తో షాక్ ఇచ్చారు. పృథ్వీషా, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ రాణించినా హాఫ్ సెంచరీ మార్కు కూడా అందుకోలేకపోయారు. మిగిలిన బ్యాట్స్మెన్ పెవిలియన్కి క్యూ కట్టడంతో భారత జట్టు 225 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ధనుంజయ బౌలింగ్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి జోరు మీదున్నట్టు కనిపించిన శిఖర్ ధావన్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు.
11 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన కెప్టెన్ శిఖర్ ధావన్, చమీరా బౌలింగ్లో కీపర్ భునకకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...
పృథ్వీషా, సంజూ శాంసన్ కలిసి రెండో వికెట్కి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 49 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసిన పృథ్వీషా, శనక బౌలింగ్లో ఎల్బీడబ్ల్యుగా పెవిలియన్ చేరాడు.
46 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 46 పరుగులు చేసిన సంజూ శాంసన్ కూడా హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. 118 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు.
ఆ తర్వాత వర్షం కారణంగా ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. తిరిగి ఆట ప్రారంభమైన తర్వాత మనీశ్ పాండే 19 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యి, మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు.
ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా 17 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి అవుట్ కాగా, సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 7 ఫోర్లతో 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది భారత జట్టు. మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్ 2, నితీశ్ రాణా 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
నవ్దీప్ సైనీ, రాహుల్ చాహార్ కలిసి 9వ వికెట్కి 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 25 బంతుల్లో 13 పరుగులు చేసిన రాహుల్ చాహార్, భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ కాగా, సైనీ 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
శ్రీలంక బౌలర్లలో అఖిల ధనంజయ, ప్రవీణ్ జయవిక్రమ మూడేసి వికెట్లు తీయగా చమీరాకి రెండు వికెట్లు దక్కాయి.