అప్పుడంటే ఇండియాపై ఏదో గెలిచాం కానీ ఇప్పుడైతే కష్టమే.. పాక్ దిగ్గజ పేసర్ కామెంట్స్
IND vs PAK: చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు ఎప్పుడు జరిగినా ప్రత్యేకమే. ఆ కోవలోకి వచ్చేవాటిలో అగ్రస్థానంలో వచ్చేది ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్. ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్-2022 లో తలపడబోతున్నాయి.

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు జట్ల అభిమానులకు పండుగే. ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ పై ఘనమైన రికార్డు కలిగి ఉన్న భారత జట్టు.. గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్ లో పాక్ చేతిలో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు.. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా దారుణంగా విఫలమై ఐసీసీ టీ20 టోర్నీలలో పాక్ కు తొలిసారి తలొగ్గింది. కాగా ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ లో కూడా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి.
అయితే గతేడాది తాము గెలిచినా ఈసారి మాత్రం టీమిండియాను ఓడించడం అంత సులువేం కాదని.. గత కొంతకాలంగా భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్ అన్నాడు.
తాజాగా అతడు మాట్లాడుతూ.. ‘ఈసారి ఇండియా సరైన ప్రణాళికతో వస్తుంది. అందులో సందేహమే లేదు. గతేడాది భారత్ ను పాకిస్తాన్ సులువుగానే ఓడించింది. కానీ ఈసారి మాత్రం టీమిండియాను ఓడించడం అంత తేలిక కాదు..’ అని తెలిపాడు.
ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేదానిపై ముందుగానే అంచనా వేయడం సరైంది కాదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ‘మ్యాచ్ ఫలితాన్ని ఇప్పుడే అంచనా వేయడం చాలా కష్టం. కానీ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ రెండోసారి బౌలింగ్ చేయడం ఉత్తమం.
ఎందుకంటే మెల్బోర్న్ (టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ వేదిక) పిచ్ బౌలర్లకు బాగా సహకరిస్తుంది. దాన్నుంచి బౌన్స్ ను రాబట్టొచ్చు...’అని చెప్పాడు.
ఈ మ్యాచ్ ను సుమారు లక్షా యాభై వేల మంది వీక్షిస్తారని తాను అనుకుంటున్నానని అక్తర్ అన్నాడు. వారితో పాటుగా తానూ ప్రేక్షకుల మధ్యే మ్యాచ్ ను వీక్షిస్తానని చెప్పుకొచ్చాడు. ‘ఈ మ్యాచ్ ను 1,50,000 మంది చూస్తారని నేను అనుకుంటున్నా. వారిలో 70వేల మంది భారతీయ అభిమానులే ఉంటారు. వారితో కలిసి నేను మ్యాచ్ చూస్తా..’ అని అక్తర్ వివరించాడు.