ఆ చారిత్రక ఇన్నింగ్స్ తర్వాత కనిపించని హనుమ విహారి... ఆ ఇద్దరినీ ఇంగ్లాండ్కి పిలిపించుకుని...
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీ తర్వాత జరిగే న్యూజిలాండ్ సిరీస్కి జట్లను ప్రకటించింది బీసీసీఐ. టీ20 కెప్టెన్సీ దక్కించుకున్న రోహిత్ శర్మకి టెస్టు సిరీస్ నుంచి, రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీ20 సిరీస్తో పాటు మొదటి టెస్టు నుంచి రెస్ట్ దక్కింది...
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కి ఎంపిక చేసిన జట్టులో తెలుగు కుర్రాడు, టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హనుమ విహారికి చోటు దక్కకపోవడంపై కొందరు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు...
త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కరణ్ నాయర్ను పట్టించుకోకుండా టీమ్కి దూరం చేసినట్టే, టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న హనుమ విహారిని కూడా జట్టుకి దూరం చేస్తారా? అంటూ బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు...
ఆస్ట్రేలియా టూర్లో తొలి రెండు టెస్టుల్లో పెద్దగా రాణించకపోయినా సిడ్నీ టెస్టులో అత్యద్భుతమైన పోరాటం చూపించాడు హనుమ విహారి. రెండో ఇన్నింగ్స్లో 407 పరుగుల టార్గెట్తో బరిలో దిగింది టీమిండియా...
ఛతేశ్వర్ పూజారా 77, రిషబ్ పంత్ 97 పరుగులు చేసి అవుట్ కావడంతో 272 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఇక విజయం ఖాయమని ఫిక్స్ అయిపోయిన ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ ఇచ్చారు హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్..
ఈ ఇద్దరూ 45 ఓవర్ల పాటు క్రీజుకి అతుక్కుపోయి బ్యాటింగ్ చేశారు. విహారి 161 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేయగా, అశ్విన్ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేశాడు...
బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడినా నొప్పిని దిగమింగుతూ అలాగే క్రీజులో నిలబడి, హీరోగా నిలిచిన హనుమ విహారి, గాయం కారణంగా గబ్బా టెస్టుకి దూరమయ్యాడు..
ఆ తర్వాత ఇంగ్లాండ్తో స్వదేశంలో ఆడిన సిరీస్కి ఎంపిక కాని హనుమ విహారి, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
తాజాగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కి కూడా హనుమ విహారికి పిలుపు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో సిడ్నీలో చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన విహారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్...
టీమిండియా తరుపున 12 టెస్టులు ఆడిన హనుమ విహారికి విదేశీ పిచ్లపై మంచి రికార్డు ఉంది. 2018లో ఇంగ్లాండ్ టూర్లో ఆరంగ్రేటం చేసిన విహారి, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్, వెస్టిండీస్, న్యూజిలాండ్ టూర్లలోనూ ఆడాడు...
స్వదేశీ పిచ్లపై హనుమ విహారి పెద్దగా మ్యాచులు ఆడింది కూడా లేదు. అందుకే న్యూజిలాండ్ సిరీస్ తర్వాత జరిగే సౌతాఫ్రికా టూర్లో హనుమ విహారికి చోటు దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
అలాగే పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్లను లంక టూర్ ముగియగానే ఇంగ్లాండ్ టూర్ మధ్యలో లండన్కి రప్పించుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఈ ఇద్దరి ఆఖరి టెస్టులో ఆడతారని ప్రచారం జరిగినా, ఆ టెస్టు మ్యాచ్ రద్దు కావడంతో అవకాశం రాలేదు...
అయితే పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్లకి కూడా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. దీనికి కూడా కారణం లేకపోలేదు...
న్యూజిలాండ్ సిరీస్ సమయంలోనే సౌతాఫ్రికాలో ఇండియా ఏ జట్టు పర్యటించనుంది. ఈ టూర్లో మూడు టెస్టులు ఆడుతుంది. ఈ టూర్లో ఇండియా ఏ తరుపున ఆడనున్నాడు పృథ్వీషా..
అలాగే వరుసగా ఐపీఎల్, టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీ, న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడబోతున్న సూర్యకుమార్ యాదవ్కి టెస్టు సిరీస్లో రెస్ట్ ఇచ్చి, శ్రేయాస్ అయ్యర్కి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.